ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని అంబేడ్కర్ పార్కు సమీపంలో ఉన్న చెరువు వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటు పనులను శుక్రవారం జిల్లా వైఎస్సార్సీపీ నేత జేవీవీఎన్ మూర్తి (జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర భర్త) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెడ్పీ నిధులతో అంబేడ్కర్ పార్కు, చెరువు అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. మండల కేంద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, చెరువును చూడముచ్చటగా తీర్చిదిద్ది, అక్కడ మన్యం వీరుడు అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గత కొద్దిరోజులుగా పనులు చేస్తున్నామన్నారు. త్వరలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. జెడ్పీ నిధుల ద్వారా మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ నేతలు సన్యాసిరావు, పాపారావు, తిరుపతిరావు పాల్గొన్నారు.


