సాక్షి, పాడేరు: ఎట్టకేలకు దోమతెరలు పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండేళ్లుగా పంపిణీకి నోచుకోని దోమతెరలతో మన్యంలో మలేరియా జ్వరాలు విజృంభణపై మలేరియా పంజా శీర్షికన ఈనెల 7న సాక్షిలో ప్రచురించిన కథనానికి కలెక్టర్ టి.నిశాంతి, జిల్లా మలేరియాశాఖ అధికారులు స్పందించారు. మొదటి విడతగా అందుబాటులోకి వచ్చిన 69వేల దోమతెరలను మలేరియా ప్రభావిత గ్రామాల్లో పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా మండలంలో కందమామిడి గ్రామాన్ని కలెక్టర్ టి.నిశాంతి బుధవారం సందర్శించారు. గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా జ్వరాల నియంత్రణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుబాటులోకి వచ్చిన దోమతెరలను పంపిణీ చేస్తున్నామని, ఈనెల 15వతేదీ నుంచి మలేరియా పీడిత గ్రామాల్లో దోమల నివారణ మందు మొదట విడత పిచికారి పనులు ప్రారంభిస్తామన్నారు. మలేరియా జ్వరాలపై వైద్యబృందాలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తులసీ, పలువురు వైద్యులు పాల్గొన్నారు.


