ఒకే చోట విధులు నిర్వహించనున్న దంపతులు ఆదిత్యవర్మ, తిరుమణి శ్రీపూజ
సాక్షి, పాడేరు: యువ ఐఏఎస్ల ఆదర్శ జంటకు జిల్లాలో ఒకే చోట విధులు నిర్వహించే అరుదైన అవకాశం లభించింది. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి. తిరుమణి శ్రీపూజ, ఆమె భర్త ఆదిత్య వర్మ ఇకపై జిల్లాలోనే కీలక పదవుల్లో కొనసాగనున్నారు. 2022 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆదిత్య వర్మ తొలుత అస్సాం క్యాడర్లో నియమితులయ్యారు. ఇటీవల ఢిల్లీలో తిరుమణి శ్రీపూజ, ఆదిత్య వర్మలు నిరాడంబరంగా ఆదర్శ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆదిత్య వర్మ అస్సాం రాష్ట్రం నుంచి రిలీవ్ అయి, ఏపీ క్యాడర్కు బదిలీపై వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం మంగళవారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం.. ఇప్పటివరకు పాడేరు ఐటీడీఏ పీవోగా ఉన్న తిరుమణి శ్రీపూజను జాయింట్ కలెక్టర్గా బదిలీ చేసింది. ఆమె స్థానంలో పాడేరు ఐటీడీఏ పీవోగా ఆదిత్య వర్మను నియమించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో భార్యాభర్తలిద్దరూ పాడేరు కేంద్రంగానే జిల్లా పాలనలో భాగస్వాములు కానున్నారు. భార్య జాయింట్ కలెక్టర్గా, భర్త ఐటీడీఏ పీవోగా ఒకే చోట విధులు నిర్వహించనుండడం విశేషం.


