డుంబ్రిగుడ: మండలంలోని ఆంధ్రా– ఒడిశా సరిహద్దు కురిడి పంచాయితీ పరిధిలోని గోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్ఐ ఎస్. సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. ఒడిశాలోని చటువ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి తెలంగాణకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు కలిసి గంజాయిని కొనుగోలు చేశారు. దానిని రవాణా చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు దాడి చేసి, వారి నుంచి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు తెలంగాణ వారు కాగా, నలుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి సరఫరా చేసిన ఒడిశా రాష్ట్రం చటువ గ్రామానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. గంజాయి సాగు చేసినా లేదా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యువత ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.


