ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల రహదారి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని జర్రెల పంచాయతీ కేంద్రంలో మంగళవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పర్యటించారు. గ్రామంలో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జర్రెల నుంచి మండిభ వరకు పంచాయతీరాజ్ ద్వారా నిర్మించనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే మత్స్యలింగం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల్లో సంక్షేమ పాలన జరిగిందని, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని కనీసం పట్టించుకోవడం లేదన్నారు.
బడులు లేక విద్యార్థుల అవస్థలు
పాడేరు ఐటిడిఏ పరిధిలో 168 పాఠశాలలకు భవనాలు లేక గిరిజన విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో నాడు–నేడు ద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో అనేక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని గుర్తు చేశారు.
సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గడప గడపకు సంక్షేమాన్ని అందించారన్నారు. ఇంటి వరకు పింఛన్లు, రేషన్ సరకులు అందించిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం మాటల్లోనే తప్ప ఆచరణలో లేదని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో తీసుకువచ్చిన మార్పులతో పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రేషన్ సరకుల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లి తీసుకు రావాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులకు బిల్లుల విషయంలోనే నేటి ప్రభుత్వం అసత్యం ప్రదర్శిస్తుందన్నారు. రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత కోరవడుతుందన్నారు. గిరిజన ప్రాంతానికి మేలు జరిగేలా పాలన అందించాలన్నారు. ఎంపీపీ సీతమ్మ, సర్పంచులు భాగ్యవతి, నరసింగరావు, రమేష్, బాబూరావు, ఎంపీటీసీ సుబ్బలక్ష్మీ, వైఎస్సార్సీపీ ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల అధ్యక్షులు పద్మరావు, చంద్రుబాబు, నాయకులు సురేష్, సుందరరావు, రాంప్రసాద్, సన్యాసిరావు, పాపారావు, దేవ, దాసు, తిరుపతి, రామ్మూర్తి, పులిరాజు, కొండలరావు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


