పాడేరు/గూడెం కొత్తవీది : ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, భీరక శబ్ధాలతో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా రెండు గంటల పాటు జోరు వానా కురిసింది. దీంతో రెండు గంటల పాటు జనజీవనం స్తంబించింది. విద్యుత్ సరఫరాకు కూడా కాస్త అంతరాయం ఏర్పడింది. రోడ్లన్ని పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా పంట పొలాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. వేసవి దుక్కులను ఎంతో అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
జి.మాడుగుల: మండలంలో కురిసిన భారీ వర్షానికి పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి వెళ్లే మార్గం జలమయమైంది. మండలంలో నుర్మతి, మద్దగరువు రోడ్డు, లువ్వాసింగి, సొలభం, వంజరి, గెమ్మెలి పోయే రోడ్డు మార్గాల్లో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహహనదారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. జి.మాడుగుల సంతబయలు గ్రామంలో జరిగిన వారపు సంతలో దుకాణదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. పాడేరు మార్గంలో జాతీయ రహదారిలో బొక్కెళ్లు వద్ద ముంచెత్తిన వర్షపు నీటి వలన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


