● అలసత్వం వహిస్తే అధికారులపై
కఠిన చర్యలు
● ఇన్చార్జి జాయింట్ కలెక్టర్,
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పాడేరు: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, విధి నిర్వాహణలో అధికారులు అసలత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. కలెక్టరేట్ వీడియో కాన్పరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని రెవెన్యూ అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్, ఐవీఆర్ఎస్ కాల్స్, కేవైసీ, రేషన్ పంపిణీ, పట్టదారు పుస్తకాల పంపిణీ తదితర వాటిపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజా సమస్యల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యకు మార్గం చూపాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. సివిల్ సప్లై అధికారులు నిరంతరంగా రేషన్ దుకాణాలు, డీఆర్ డిపోలను తనిఖీలు చేయాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఇన్చార్జి డీఆర్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నీలకంఠేశ్వరరావు, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


