డుంబ్రిగుడ : మండలంలోని గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్ఐ ఎల్.సురేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకులోయ మండలం మాదల పంచాయతీ తోటవలస గ్రామానికి చెందిన కిల్లో జోషప్(23) అనే గిరిజన యువకుడు బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా, హుకుంపేట మండల గడుగుపల్లి గ్రామానికి చెందిన మువ్వల శ్రీను(28) అనే యువకుడు తన స్నేహితుడితో చటువాలో జరుగుతున్న పండగను చూసేందుకు బయలుదేరారన్నారు. గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో కిలోమీటరు దూరంలో రాత్రి వేళ రెండు బైకులు బలంగా ఢీ కొన్నాయని చెప్పారు. సంఘటన స్థలంలోనే శ్రీను మృతి చెందగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జోషప్ అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో యండపల్లివలసలో మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. వారితో పాటు మరొకరు గాయాలతో ఉండగా ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మృతి చెందిన మువ్వల శ్రీను, (ఫైల్)


