ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ
ముంచంగిపుట్టు: అడవులకు నిప్పు పెట్టకుండా ప్రకృతి సంపదను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ అన్నారు.మండలంలోని రంగబయలు పంచాయతీ గొబ్బరిపడ గ్రామంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అడవులకు నిప్పు పెట్టడం వలన కలిగే అనర్థాలపై అటవీశాఖాధికారులు గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో అడవుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ మాట్లాడుతూ అడవులకు నిప్పు పెట్టడం వల్ల పర్యావరణ వ్యవస్థ, వన్యప్రాణులు, మానవాళికి తీవ్ర ముప్పు కలుగుతుందని, అమూల్యమైన ప్రకృతి సంపద, చెట్లు, జీవ వైవిధ్యాన్ని నాశనమవుతుందన్నారు. వేసవిలో వ్యవసాయ వ్యర్థాలు, ఎండుగడ్డిని కాల్చవద్దని, ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులకు సమాచారం అందించాలని, అడవులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. అనంతరం జోడిగుమ్మ నుంచి గొబ్బరిపడ వరకు వచ్చే ఆర్వోఎఫ్ఆర్ రహదారిపై ఫారెస్ట్ అధికారులు, పిఆర్ అధికారులు సర్వే వేశారు. పీఆర్ ప్రాజెక్ట్సు ఏఈ అశోక్, ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీను, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు.


