పాడేరు : టీడీపీకి చెందిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఆదివాసీలపై చేసిన వాఖ్యలు ఏ మాత్రం కూడా క్షమించరానివని ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేశారు. ఆయన చేసిన వాఖ్యలకు నిరసనగా ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామారావు దొర మాట్లాడుతూ ఆదివాసీలు తమ సమస్యను చెప్పుకునేందుకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ను కలిసేందుకు వెళ్తే ఆయన పరుషపదజాలంతో ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కించపరిస్తూ బహిరంగంగా దూషించడంపై ఆదివాసీ సమాజం అంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఆదివాసీల పట్ల కనీసం గౌరవం లేకుండా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదన్నారు. గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అశోక్ చేస్తున్న ప్రయాత్యాన్ని ప్రశ్నించడమే ఆదివాసీల తప్పా అన్నారు. ఓర్పు, సహనం కోల్పోయి కుల, ధనంహాకారం, అధికార మదంతో ఆదివాసీలపై విచక్షణ కోల్పోయి కించపర్చేలా మాట్లాడటం రాజ్యంగా విరుద్ధమన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా ఎస్పీను కలిసి ఎమ్మెల్యే అశోక్పై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ వ్యవహారంపై క్షమాపణతో ఊరుకోమన్నారు. అశోక్పై కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆదివాసీలంతా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టపులి శ్రీనివాస పడాల్, స్టేట్ కో–ఆర్డినేటర్ సోమెలి సింహాచలం, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జీజేఆర్ మజ్జి, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిదే మాధవరావు, జీఎస్యూ రాష్ట్ర సమన్వయకర్త కిరసాని కిశోర్, జీఎస్యూ నాయకులు పార్థసారధి, సత్య, ఆదివాసీ జేఏసీ జిల్లా ప్రతినిధులు నాగరాజు, శంకర్ పాల్గొన్నారు.
పదవికి రాజీనామా చేయించి,
టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి
ఆదివాసీలపై అనుచిత వాఖ్యలను
సహించం
క్షమాపణలతో ఊరుకునేది లేది
ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్
రామారావు దొర
పాడేరులో ఆందోళన


