అరకులోయటౌన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు బినామీల కోసమే అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పరిపాలన రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందేనన్నారు. కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ 2028 లోపు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, అమరావతే రాజధాని అని అసెంబ్లీలో తీర్మానం చేయడం సిగ్గు చేటన్నారు.
విచ్చలవిడిగా బెల్టుషాపులు
కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుచేసి, మారుమూల గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులతో మద్యపానాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. అమాయక గిరిజనులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, పల్టాసింగ్ విజయ్ కుమార్, పార్టీ నాయకులు కొర్రా అర్జున్రావు, విజయదశమి, శెట్టి మోహన్ పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో
అభివృద్ధికి ప్రాధాన్యం
కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం
అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


