పాడేరు: జిల్లావ్యాప్తంగా గంజాయి వినియోగం, రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అంకార్డ్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.గంజాయి ప్రభావం ఉన్న ప్రతి గ్రామం, మండలంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి వల్ల వ్యక్తికి, సమాజానికి కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గంజాయికి బానిసైన వారిలో మార్పు తెచ్చి, వారు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలన్నారు. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల ద్వారా స్వల్పకాలిక రుణాలు మంజూరు చేసి గిరిజనుల జీవనోపాధికి తోడ్పడాలన్నారు. చట్టవిరుద్ధంగా గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలీస్ యంత్రాంగం నిఘా..
ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ.. చెక్పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇప్పించి వారిని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచవచ్చని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి నందు, డీఎల్పీవో కుమార్, డ్వామా పీడీ విద్యా సాగర్, డీఆర్డీఏ పీడీ మురళి పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్ కుమార్


