ముంచంగిపుట్టు: అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు.. నిత్యం ఎదురవుతున్న ప్రయాణ కష్టాలు మరోవైపు.. వెరసి మండలంలోని బరడ పంచాయతీ సోలగంపుట్టు గ్రామ గిరిజనులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో, మంగళవారం వారే స్వచ్ఛందంగా తరలివచ్చి శ్రమదానం చేశారు. సోలగంపుట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు పాడై నెలలు గడుస్తోంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాడైన కల్వర్టును బాగు చేసేందుకు గ్రామస్తులంతా ఏకమయ్యారు. రాళ్లు సేకరించి తెచ్చి, గుంతలు పడిన చోట పూడ్చి, మట్టి వేసి రాకపోకలకు వీలుగా కల్వర్టును తాత్కాలికంగా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, గ్రామానికి కొత్త కల్వర్టును మంజూరు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన రహదారిని నిర్మించి తమ ప్రయాణ కష్టాలను తీర్చాలని సోలగంపుట్టు గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
స్వచ్ఛందంగా కల్వర్టును బాగు చేసుకున్న సోలగంపుట్టు గ్రామస్తులు


