ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలి
నిరసన వ్యక్తం చేస్తున్న ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకన్న
దేవరాపల్లి : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన విబిజి రామ్జి పథకాన్ని తక్షణమే రద్దు చేసి మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి. వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కార్మికులంతా పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో పాటు 39 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చి అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని యధావిధిగా అమలు చేసి 200 పనిదినాలు, 600 రోజు కూలి సొమ్మును పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే ఈనెల 12న దేశ వ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.


