సందడిగా గుర్రాల పోటీలు
నాతవరం: జిల్లా స్థాయి గుర్రప్పందాలు హోరా హోరీగా సాగాయి. మండలంలో లింగంపేట గ్రామంలో మహలక్ష్మి పండగ సందర్భంగా ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో అచ్యుతాపురం మండలం రామన్నపాలెం గుర్రం విజేతగా నిలిచింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో కోటనందూరు మండలం గుర్రం, చతుర్థ స్థానంలో లింగంపేటకు చెందిన మహలక్ష్మి గుర్రం నిలిచాయి. ఆయా గుర్రాల యజమానులకు వరుసగా రూ.12 వేలు, రూ. 10 వేలు, రూ. 8 వేలు, రూ. 6 వేలతోపాటు షీల్డులు అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న 12 గుర్రాల యజమానులకు రవాణా చార్జీలతోపాటు ప్రోత్సాహకాలు ప్రదానం చేశారు. అదేవిధంగా యూత్ అధ్యక్షుడు దేవాడ దొర ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులు పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు నగదుతోపాటు షీల్డు, ప్రోత్సాహకాలు అందజేశారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. నాతవరం ఎస్ఐ వై,తారకేశ్వరరావు బందోబస్తు ఏర్పాటు చేశారు.


