రాష్ట్రంలో హిట్లర్ను తలపించేలా పాలన
పాడేరు: రాష్ట్రంలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి, హిట్లర్ పోకడలతో రాక్షస పాలన సాగిస్తోందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం పాడేరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. తిరుమల లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ జరగలేదని సాక్షాత్తూ సిట్, సీబీఐ తమ చార్జ్షీట్లో స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం ఇంకా అబద్ధాలను ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందని విమర్శించారు. కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ అగ్రనేతలను భౌతికంగా అంతం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని విశ్వేశ్వరరాజు ఆరోపించారు. అంబటి రాంబాబు, విడుదల రజనీ, బొల్లా బ్రహ్మనాయుడు, జోగి రమేష్, భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతల ఇళ్లపై దాడులు చేయడం ఈ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు.ఈ దాడులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని, గూండాలను ప్రోత్సహించి ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులు అన్ని మీడియా ఛానళ్లలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, పోలీసులు కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పూర్తిగా విఫలమైందని, ప్రస్తుతం కేవలం జంగిల్ రాజ్ పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన కూటమి ప్రభుత్వంపై గవర్నర్, రాష్ట్రపతి తక్షణమే స్పందించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అక్రమాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వారికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని హత్యాయత్నాలు చేసినా భయపడే ప్రసక్తే లేదని.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై పోరాటం కొనసాగిస్తామని విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు.
చంద్రబాబు నీచ రాజకీయాలు :
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన లడ్డూ ప్రసాదం అంశాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం నీచమైన ఫ్లెక్సీ రాజకీయం చేస్తోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం అరకులోయ సీఐ హిమగిరిని కలిసిన ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కూటమి నాయకుల తీరుపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజనిలపై టీడీపీ శ్రేణులు జరిపిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు యాదృచ్ఛికంగా జరిగినవి కావని, లడ్డూ వివాదంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. .లడ్డూ విషయంలో వస్తున్న ఆరోపణలు తప్పని ఇప్పటికే పలు నివేదికల ద్వారా స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. పవిత్రమైన ప్రసాదం పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ, రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం సిగ్గుచేటని విమర్శించారు. అసలు విషయంపై చర్చ జరగకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించి, భయాందోళనలు కలిగించాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. అక్రమ కేసులు, దాడులతో వైఎస్సార్సీపీ నాయకులను భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట అరకులోయ, డుంబ్రిగుడ పార్టీ మండల అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, సొవ్వా సర్పంచ్ పి. అశోక్ కుమార్, డుంబ్రిగుడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిముడు రాము, నాయకులు గరం పూర్ణ, నాగేశ్వరరావు, కల్యాణ్ పాల్గొన్నారు.
తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారం
ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు
ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రకు
తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వం
పాడేరు ఎమ్మెల్యే
మత్స్యరాస విశ్వేశ్వరరాజు ధ్వజం
రాష్ట్రంలో హిట్లర్ను తలపించేలా పాలన


