వ్యసనాలకు దూరంగా ఉండాలి
● చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్
చింతూరు: మత్తుకు బానిసైన యువత తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ అన్నారు. అభ్యుదయం కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఒడిశా జంక్షన్ నుంచి చింతూరు మెయిన్రోడ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు పోలీసులు కృషి చేస్తున్నారని, దీనికి ప్రజల సహకారం కూడా కావాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని, యువత వాటి జోలికిపోకుండా తమ భవిష్యత్తును సుగమం చేసుకోవాలని ఏఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం పాల్గొన్నారు.


