
పోలవరం నిర్వాసితులకు కొత్త చిక్కు?
ఇప్పటికే పోలవరం అడ్మినిస్ట్రేటివ్కు ఇచ్చిన పాతా ఖాతా నంబర్లు
డిసెంబర్ తరువాత మారనున్న
ఖాతా నంబర్లు
ఈ లోగా పరిహారం
జమకాకుంటే ఇబ్బందులే
సుమారు 2వేల మంది నిర్వాసితులకు ఎదురుకానున్న అవస్థలు
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ (ఏపీజీవీబీ)ను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)లో సాంకేతికంగా విలీనం చేయడం వల్ల పోలవరం నిర్వాసితులకు కొత్త చిక్కు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరిలో అధికశాతం మందికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్లో ఖాతాలు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారానికి సంబంధించి ఇవే ఖాతా నంబర్లు ఇచ్చారు. వీటిని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ నేపథ్యంలో జరిగిన విలీనం వల్ల ఏపీజీవీబీ ఖాతాదారుల నంబర్లు మారుతాయని
సంబంధిత అధికారవర్గాలు చెబుతుందటం నిర్వాసితుల్లో ఆందోళనకు దారితీస్తోంది.
ఏపీజీబీలో ఏపీజీవీబీ విలీనంతో సమస్య
చింతూరు: పోలవరం ముంపులో భాగంగా చింతూరు డివిజన్లో ప్రాధాన్యత క్రమంలో చేర్చిన 32 గ్రామాల నిర్వాసితుల గృహాల విలువ, ఆర్అండ్ఆర్ పరిహారం త్వరలోనే అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరంతా గృహాల విలువ, ఆర్అండ్ఆర్ పరిహార నిమిత్తం గతంలోని ఏపీజీవీబీ ఖాతా నంబర్లను అధికారులకు ఇచ్చారు. దీంతో పరిహారం వారి ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఇంతలోనే ఖాతా నంబర్ల మార్పుతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు తమ ఖాతాల్లో పరిహారం జమ అయితే ఫర్వాలేదని, లేకుంటే మారిన ఖాతా నంబర్లను తిరిగి పోలవరం అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఐఎఫ్సీ కోడ్ మారితే పెద్ద ఇబ్బంది లేకున్నా నిర్వాసితుల ఖాతా నంబర్లు మారితే మాత్రం వాటిని తిరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే చాలా సమయం పడుతుందని ఆర్అండ్ఆర్ సిబ్బంది అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున గ్రామీణ బ్యాంకు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్బ్యాంకు (ఏపీజీవీబీ)గా మారింది. ప్రస్తు తం విలీనంలో భాగంగా అదికాస్తా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు(ఏపీజీబీ)గా రూపాంతరం చెందింది.
చింతూరు డివిజన్లో కూనవరం, వీఆర్పురం, సీతాపురం, నెల్లిపాక, చింతూరులో ఏపీజీబీ బ్యాంకులున్నాయి. ఐదు బ్యాంకుల పరిధిలో సుమారు 40 వేల నుంచి 50 వేల వరకు ఖాతాదారులుండగా వీరిలో సుమారు 2 వేల మంది పోలవరం నిర్వాసితులు ఉన్నారు. గతంలో నాలుగు మండలాల్లో ప్రధాన బ్యాంకులు లేకపోవడంతో నాగార్జున గ్రామీణ బ్యాంకు మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో అందరూ ఈ బ్యాంకు ద్వారానే తమ లావాదేవీలు కొనసాగించేవారు. కాలక్రమేణా ప్రధాన బ్యాంకులు అందుబాటులోకి వచ్చినా చాలామంది ఖాతాదారులు ఈ బ్యాంకులోనే తమ ఖాతాలను కొనసాగిస్తున్నారు.
ప్రధానంగా మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు ఈ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్నారు. వీరిలో వ్యాపారులు, రైతులతో పాటు స్వయం సహాయక గ్రూపుల మహిళలు అధికసంఖ్యలో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రతి మండలంలో ఈ బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు చెందిన లావాదేవీలు అధికంగా జరుగుతుంటాయి.
ఇప్పటివరకు ఏపీజీవీబీగా ఉన్న ఈ బ్యాంకు ఈనెల 13 నుంచి ఏపీజీబీగా రూపాంతరం చెందింది. దీనికోసం కొన్ని రోజులపాటు ఆన్లైన్ సేవలను నిలిపివేసి మార్పులు చేపట్టారు. ఈ నేపధ్యంలో బ్యాంకుకు సంబంధించిన ఐఎఫ్ఎస్సీ కోడ్ మారడంతో పాటు ఖాతాదారుల నంబర్లు, యాప్ కూడా మారాయి. అయితే ఖాతా నంబర్ల మార్పుతో ఇప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు., ఈ ఏడాది డిసెంబర్ వరకు పాత ఖాతా నంబర్లతోనే లావాదేవీలు కొనసాగించవచ్చని, తరువాత ఖాతా నంబర్లు మార్చుకోక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.

పోలవరం నిర్వాసితులకు కొత్త చిక్కు?