ఆదిలాబాద్రూరల్: ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించి, ప్రాణాలు కాపాడే మొదటి రెస్పాండర్లుగా యువత బాధ్యతాయుతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చా రు. మండలంలోని యాపల్గూడ శివారు ప్రాంతంలోని 2వ బెటాలియన్లో గురువారం తెలంగాణ స్పెషల్ పోలీస్ ఎస్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఏదైనా ప్రమాదం జరిగిన క్షణంలో అధికారిక యంత్రాంగం, అంబులెన్స్ వచ్చే వరకు వేచి చూడకుండా, శిక్షణ పొందిన యువత తొలి 5 నుంచి 10నిమిషాల్లో స్పందిస్తే ఎన్నో విలువైన ప్రాణాలు రక్షించవచ్చన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 245మంది యువతీ, యువకులకు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి వాలంటీర్కు ప్రత్యేక కిట్, సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు తెలిపారు. 2వ బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ రఘునా థ్ చౌహాన్, శ్రీనివాస్ రావు, ఆపద మిత్ర శిక్షణార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


