కైలాస్నగర్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈనెల 15న రూ.3ల చొప్పున పెంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా మంగళవారం మరోసారి పెంపు నిర్ణయం తీసుకుని అమల్లోకి తెచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండో సారి పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై రూ.0.86 పైసలు, డీజిల్పై రూ.0.83 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే జిల్లాకు వచ్చేసరికి అవి రూపాయి వరకు పెరిగాయి. ఇప్పటికే పెరిగిన పెట్రో ధరలు వాహనదారులకు భారంగా మారాయి. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెంచిన ధరలు తగ్గించాలని ఓ వైపు ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండగా.. ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఈ పెంపుతో జిల్లాలో పెట్రోల్పై రోజుకు రూ.70వేలు, డీజిల్పై రూ.లక్షన్నర వరకు అదనపు భారం పడనుంది. ఈ లెక్కన నెలకు డీజిల్పై రూ.45లక్షలు, పెట్రోల్పై రూ.21లక్షలు కలిపి మొత్తంగా రూ.66లక్షల వరకు భారం పడనున్నట్లుగా తెలుస్తోంది.
జిల్లాలో
పెట్రోల్ బంక్లు : 70
రోజువారీగా..
డీజిల్ వినియోగం : 150–170 కిలోలీటర్లు
పెట్రోల్ వినియోగం : 70– 80 కిలోలీటర్లు
పాత ధర కొత్త ధర
పెట్రోల్ రూ.112.25 రూ.113.25
డీజిల్ రూ.100.39 రూ.101.39


