కార్యదర్శులకు ‘ఉపాధి’ బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

కార్యదర్శులకు ‘ఉపాధి’ బాధ్యతలు

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

● కూలీల హాజరు నుంచి పనుల కల్పన వరకు పర్యవేక్షణ ● ఉత్తర్వులు జారీ చేసిన పీఆర్‌ ఆర్‌డీ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌

కైలాస్‌నగర్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. కూలీల సంఖ్య పెంచడంతో పాటు పనులు కల్పించడం, ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో ఫేస్‌ అథెంటికేషన్‌ హాజ రు వంటి ఏడు రకాల రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్‌,గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ దివ్యదేవరాజ న్‌ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో గ్రామాల్లో ఉపాధిపనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరిస్థితి ఇలా..

గతంలో పనిచేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించాక ఉపాధి పనులను పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షించేవారు. టెక్నికల్‌ అసిస్టెంట్లతో కలిసి అన్ని పనులు వారే నిర్వహించేవారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఈక్రమంలో పలువురు కార్యదర్శులు తమ రెగ్యులర్‌ పనులకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధి పర్యవేక్షణను విస్మరించినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఉపాధి పర్యవేక్షణ బాధ్యతలు కూడా నిర్వహించాలంటూ కార్యదర్శులను ఆదేశించింది.

కార్యదర్శులు ఏం చేయాలంటే..

ఉపాధి సిబ్బంది సాయంతో గ్రామాల్లో వంద రోజుల పనులు, వనమహోత్సవ కార్యక్రమాలు చేపట్టి పర్యవేక్షించాలి. మేట్లను నియమించాలి. వారితో కలిసి కూలీల నుంచి పని డిమాండ్‌ వివరాలు తీసుకోవాలి. కూలీల మస్టర్లు నమోదు చేసుకునేలా చూడటంతో పాటు వారం చివరలో వాటిపై కౌంటర్‌ సైన్‌ చేసి టెక్నికల్‌ అసిస్టెంట్లకు అప్పగించాలి. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో కూలీల ఫేస్‌ అథెంటికేషన్‌ ద్వారా హాజరును అప్‌లోడ్‌ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీటితో పాటు జాబ్‌కార్డుల అప్‌డేషన్‌, వారినికోసారి సమావేశాల నిర్వహణ, పని ప్రదేశాల్లోని బోర్డును తనిఖీ చేయడం, కూలీలకు అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం, గ్రీన్‌ నెట్‌షెడ్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పర్యవేక్షించాలి. ముఖ్యంగా సర్పంచ్‌లతో సమావేశమై కూలీల సంఖ్య పెంచేలా శ్రద్ధ వహించాలి. వీటితో పాటు ఏడు రికార్డులను తప్పనిసరిగా నిర్వహింలని ప్రభుత్వం ఆదేశించింది. సర్కారు తాజా నిర్ణయంతో కూలీల సంఖ్య పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఉత్తర్వులు అందాయి

ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. వాటిపై ఇటీవల సెక్రెటరీలతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతీ కార్యదర్శి తప్పనిసరిగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచడంతో పాటు పనులు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలి.

– రాథోడ్‌ రవీందర్‌, డీఆర్డీవో

Advertisement
 
Advertisement
Advertisement