నేరేడిగొండ: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. నూతన వంటగదితో పాటు ప్రహరీని ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ పోలీస్ తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. గంజాయి, గుడుంబా, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలన్నారు. ఫిర్యాదుదారులపై గౌరవంగా వ్యవహరిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం రోల్ మామడ వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ను ఎస్పీ తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే, ఇచ్చోడ రూరల్ సీఐ రమేశ్, నేరేడిగొండ ఎస్సై ఇమ్రాన్, ఆర్ఎస్సై ఆశన్న, వెటర్నరీ అధికారి పావని తదితరులు పాల్గొన్నారు.


