ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. పక్షం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం 45.3 డిగ్రీ సెల్సియస్ మార్కు దాటగా సోమవారం 45.9 డిగ్రీ సెల్సియన్గా నమోదైంది. ఒక్కసారిగా ఆదిలాబాద్ నిప్పుల కుపంటిలా మారింది. దీంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం 9 దాటిందంటే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూ వాతవరణం దర్శనమిస్తోంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ కారణంగా ఉపాధిహామీ కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు.
జిల్లాలో సోమవారం బేలలో జైనథ్ మండలంలో 45.9 డిగ్రీ సెల్సి యస్ నమోదవగా.. సా త్నాలలో 44.4, ఇచ్చోడలో 44.3, భోరజ్లో 44.2, బోథ్లో 43.9 ఇలా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బ బారిన
పడుతున్న జనం
జిల్లాలో వడదెబ్బతో ఇటీవల ఇ ద్దరు మృత్యువాత పడ్డారు. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎండలో పనిచేసే వారు, తిరిగే వారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని గొ డుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ ఫారన్హిట్ దా టడం, కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ తదితరల క్షణాలు బయట పడితే వడదెబ్బగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు.
జంకుతున్న జనం
ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలకు విరామం లేకుండా నడుస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో తప్పనిసరి బయటకు వెళ్లే వారు శీతలపానియాలు, కొబ్బరి బోండాలు, తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఎండ తీవ్రత కారణంగా జిల్లాలో వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. మూగజీవాలు దాహార్తితో అల్లాడుతున్నాయి. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. నీటిని ఎక్కువ తాగాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. ఎండలో వెళ్లేవారు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వేడి ప్రదేశాల వద్ద పనిచేసే వారు జాగ్రత్తలు పాటించాలి.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో


