ఆదిలాబాద్టౌన్: యువత ఆయా రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం ఆధునిక నైపుణ్యాభివృద్ధిపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు.యువత స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం, కళా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో నిపుణులు పవర్పాయింట్ ద్వారా ఐటీ, సేవా, స్వయం ఉపాధి విభాగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను వివరించారు. ఇంటర్వ్యూ, డిజిటల్ స్కిల్స్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఐఈవో గణేశ్జాదవ్, డీడబ్ల్యూవో మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.మనోహర్ రావు, మైనార్టీ సంక్షేమ అధికారి కలీం, డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జనగణన పకడ్బందీగా చేపట్టాలి
కై లాస్నగర్: జనగణన–2027 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు రెండో విడత శిక్షణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సమర్థంగా ఉపయోగించడం ద్వారా గణాంకాల్లో ఖచ్చితత్వం పెరుగుతుందన్నారు. నమోదు ప్రక్రియను రెండు విడతల్లో చేపడుతున్నట్లుగా వివరించారు. ముందుగా ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి గృహాల జాబితాను సేకరిస్తారన్నారు. అనంతరం అధికారులకు జనగణన కిట్లను అందజేశారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్కుమార్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.


