కైలాస్నగర్: ఉపాధి హామీ పనులకు హాజర య్యే కూలీల సంఖ్య పెంచేలా శ్రద్ధ వహించాల ని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అన్నారు. జిల్లాలో 25మందికి లోపు కూలీలు హాజరవుతున్న 68 గ్రామాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కూలీలు పనులకు రాకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ గ్రామంలో కనీసం 50 మంది కూలీలు పనులకు వచ్చేలా చూడాలన్నారు. పాత పనులు పూర్తయినట్లయితే కొత్త పనులు ఎంపిక చేయాలన్నారు. ఇందులో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, అదనపు డీఆర్డీవో కుటుంబరావు, గజాణన్రావు, ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
జైనథ్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలకేంద్రంలో ని కేజీబీవీలో మంగళవారం సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఇందులో తహసీల్దార్ నారాయణ, ఎస్వో వీణాకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


