ఆదిలాబాద్టౌన్: వాహన డ్రైవర్లు ప్రతీ ఆరునెలలకోసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్కుమార్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పుత్లీబౌళి పట్టణ ఆరోగ్యకేంద్రంలో డ్రైవర్లకు నేత్ర వైద్యశిబిరం నిర్వహించగా డీటీసీతోపాటు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ హాజరై మాట్లాడారు. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ఫోన్ మాట్లాడవద్దని తెలిపారు. ఆటో డ్రైవర్లు ముందు సీటులో ప్రయాణికులను కూర్చోబెట్టుకోవద్దని సూచించారు. వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. రాంగ్రూట్, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. జిల్లా రవాణాశాఖ అధికారి ఎస్.శ్రీనివాస్, కంటి వైద్య నిపుణుడు అభినయ్, ఎంవీఐలు అల్లె శ్రీనివాస్, ప్రదీప్కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


