ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న గజదొంగ టేకం తుకారాంపై బుధవారం పీడీయాక్ట్ నమోదు చేసినట్లు ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ తెలిపారు. ఉట్నూర్ మండలంలోని దంతనపల్లికి చెందిన తుకారాంపై గతంలో 36 కేసులు నమోదు కాగా, అందులో దాదాపు 18 కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇటీవల అతనిపై ఉట్నూర్ పోలీస్స్టేషన్లో మరో ఏడు కేసులు, మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదయ్యాయి. మొత్తంగా అతనిపై 44 కేసులు ఉన్నట్లు తెలిపారు. జైలుశిక్ష అనుభవించినా అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో మళ్లీ చోరీలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రజల భద్రతను కాపాడడం కోసం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు కలెక్టర్ నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. దీంతో నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించినట్లుగా వివరించారు. నిందితుల అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే పోలీసుల లక్ష్యమన్నారు.


