ఇంధన కొరత కారణంగా నిర్మానుష్యంగా పెట్రోల్ బంక్
క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్తూ..
జిల్లా కేంద్రంలోని ఓ బంకులో వాహనదారుల రద్దీ
ఇంధన కొరత రానుందనే పుకార్లతో వాహనదారులు బుధవారం పెట్రోల్ బంకుల ఎదుట బారులు తీరారు. ఉదయం పది గంటల వరకు బాగానే ఉండగా తర్వాత ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రూ.100, రూ.150 పెట్రోల్ పోయించుకునే వారు సైతం ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. కొంతమంది క్యాన్లలో నింపుకుని మరీ తీసుకెళ్లారు. దీంతో జిల్లాలోని పలు బంకుల్లో నిల్వలు నిండుకుని నిర్మానుష్యంగా మారాయి. కొన్ని బంకుల్లో ఇంధనం ఉండటంతో వాహనదారులందరికీ అందించాలనే ఉద్దేశంతో సరఫరాపై పరిమితి విధించారు. ఒక్కో వాహనదారుడికి రూ.200 నుంచి రూ.300 పెట్రోల్ మాత్రమే విక్రయించారు. నిర్వాహకులు ఎలాంటి ఇంధన కొరత లేదని మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేసినప్పటికీ వాహనదారుల రద్దీ మాత్రం రాత్రి వరకు కొనసాగింది. పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, పోలీసులు బంకుల వద్దకు చేరుకుని పర్యవేక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాటిల్స్, క్యాన్లలో పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. ఇందుకోసం ప్రత్యేక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. భోరజ్ మండలంలోని పలు బంకుల్లోనూ వాహనదారులు బారులు తీరి కనిపించారు. – కై లాస్నగర్/సాత్నాల


