పీఠంపై గురి
మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ గెలుపు కోసం ప్రణాళికలు బూత్ స్థాయి నుంచి కార్యాచరణ పర్యవేక్షణ కోసం పలువురికి బాధ్యతలు
పులి కదలికలపై నిఘా
భీంపూర్ మండల సరిహద్దు గ్రామాలైన తాంసి(కే), గొల్లఘాట్, గుంజాల, పిప్పల్కోటి శివారులో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అటవీశాఖ అధికారులు అప్రమత్తమై నిఘా పెంచారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. రాత్రి వేళలో చలితీవ్రత తగ్గనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.
సాక్షి, ఆదిలాబాద్: ఈ సారి మున్సిపల్ ఎన్నికలపై కాషాయ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా పీఠాన్ని కై వసం చేసుకోవాలని భావిస్తోంది. మెజార్టీ మార్క్ దాటుతామన్న ఆశాభావం ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గత మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీ 47 వార్డుల్లో పోటీ చేయగా, 11 చోట్ల గెలుపొందింది. ఈసారి అన్ని వార్డుల్లో బరిలో నిలవడంతో పాటు మెజార్టీ స్థానాలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
పోలింగ్ బూత్ నుంచి..
పట్టణంలోని ఒక్కో వార్డులో మూడు నుంచి ఐదు వరకు పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కో బూత్కు కన్వీనర్ను కలుపుకొని, 15 మంది కార్యకర్తలతో ఆ పార్టీ కమిటీ రూపొందించింది. ఒక్కొక్కరు ఆ బూత్ పరిధిలోని ఐదు కుటుంబాలను ప్రతీ రోజు విజిట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, కాషాయం పార్టీని ఆదరిస్తే జరిగే లబ్ధిని వారికి తెలియజేయాలని పార్టీ సూచించింది. దానికి అనుగుణంగా కార్యకర్తలు తమకు కేటాయించిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ..
పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని సీనియర్ నాయకులతో కలిపి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని 20 మందితో నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర, జాతీయ పార్టీ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికను అమలు చేయాలి. మండలాల్లోని నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నారు. గ్రామ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ పదవుల్లో ఉన్న మండల సీనియర్ నాయకులకు పట్టణంలోని 49 వార్డులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. వారు పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు చేపట్టే కార్యాచరణ పరిశీలిస్తుండాలి.
కార్పొరేటర్ల రాక..
మహారాష్ట్రలోని ముంబై, రాజస్థాన్లోని మున్సిపల్ కార్పొరేటర్లు ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ఆయా వార్డులకు సూపర్వైజర్లుగా పరిశీలన చేస్తున్నారు. 8 మంది కార్పొరేటర్లకు వార్డులను విభజించి బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితిపై జాతీయ నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లా నాయకులతో సమీక్షించారు. జిల్లా నుంచి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ వీసీలో పాల్గొన్నారు. నిర్మల్లో అమిత్ షా పర్యటన ఉండగా, ఆదిలాబాద్ పట్టణానికి జాతీయ, రాష్ట్ర ముఖ్య నాయకులను ప్రచారానికి తీసుకువచ్చే విషయంలో ఈ వీడియో కాన్ఫరెన్స్లో చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకై తే జిల్లాకు రానున్న నాయకుల పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బలం పుంజుకునేలా కార్యాచరణ
ఇప్పటివరకు చేపట్టిన కార్యాచరణతో పార్టీ 20కి పై గా వార్డుల్లో బలంగా ఉందని కాషాయ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మరిన్ని వార్డుల్లోనూ పార్టీ పుంజుకునేలా కార్యాచరణను సిద్ధం చేసి అమలు చే సేలా ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు.


