ఆ పార్టీలన్నీ కుమ్మక్కయ్యాయి
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. మున్సిపల్ పరిధిలోని 5, 6, 7, 8 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీలు కలిసి ఎంఐఎం అభ్యర్థిని చైర్పర్సన్ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి పనులకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. తాను కృషి చేసిన ఫలితంగానే ఇటీవల కలెక్టర్ ఖాతాలో రూ. 109 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. విషయాన్ని పట్టణ ప్రజలు గమనించి, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి ప్రగతికి బాటలు వేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు సాయి కృష్ణ, ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


