బీజేపీ, బీఆర్ఎస్ అభివృద్ధి నిరోధక పార్టీలు
కై లాస్నగర్: బీజేపీ, బీఆర్ఎస్ అభివృద్ధి నిరోధక పార్టీలని, మున్సిపల్ ఎన్నికల్లో వాటికి తగిన బుద్ధి చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆదిలాబాద్ వాసులను కోరారు. మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా జిల్లాకు వచ్చిన ఆయన పట్టణంలోని ఓ హోటల్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 12 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందుతుందే తప్ప దేశంలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన బీఆర్ఎస్ పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలోని సుభాష్నగర్, రిక్షాకాలనీలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.


