breaking news
Warp Match
-
బెంబేలెత్తించిన భారత పేస్
► l84 పరుగులకే కుప్పకూలిన ► ‘వార్మప్’లో 240 పరుగులతో టీమిండియా ఘన విజయం చాంపియన్స్ ట్రోఫీలో ఇక భారత జట్టు పేస్ బౌలింగ్ గురించి ఏ మాత్రం ఆందోళన చెందనవసరం లేదు. న్యూజిలాండ్తో తొలి వార్మప్లో ఆకట్టుకున్న మన ఫాస్ట్ బౌలర్లు, రెండో మ్యాచ్లో నిప్పులు చిమ్మారు. భువనేశ్వర్ (3/13), ఉమేశ్ (3/16) ఒకరితో ఒకరు పోటీ పడి వికెట్లు తీయడంతో బేలగా మారిపోయిన బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. బ్యాటింగ్లో కార్తీక్, పాండ్యా, ధావన్ రాణించడంతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా అసలు పోరుకు ధీమాగా సిద్ధమైంది. ఓవల్: ప్రధాన మ్యాచ్లకు ముందు బంగ్లాదేశ్తో వార్మప్ పోరును భారత జట్టు బ్రహ్మాండంగా వాడుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో జట్టుకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 240 పరుగులతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (77 బంతుల్లో 94 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (54 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (67 బంతుల్లో 60; 7 ఫోర్లు) చెలరేగారు. రూబెల్ హుస్సేన్కు 3 వికెట్లు దక్కాయి. కోహ్లి, ధోని, యువరాజ్ బ్యాటింగ్కు దూరంగా ఉన్నారు. అనంతరం బంగ్లాదేశ్ 23.5 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. మెహదీ హసన్ మిరాజ్ (24)దే అత్యధిక స్కోరు. ఒక దశలో ఆ జట్టు 22 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే మిరాజ్, సున్జముల్ (18) కొద్దిసేపు వికెట్లు పడకుండా పోరాడారు. షమీ, బుమ్రా, పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు. మొత్తం 9 వికెట్లను పేసర్లే కూల్చగా... ఒకే ఓవర్ వేసిన స్పిన్నర్ అశ్విన్కు కూడా ఒక వికెట్ దక్కింది. రోహిత్ విఫలం... తొలి వార్మప్ మ్యాచ్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ (1) ఈ మ్యాచ్లో నిరాశ పర్చాడు. రూబెల్ వేసిన వైడ్ బంతిని అతను వికెట్లపైకి ఆడుకొని అవుటయ్యాడు. రహానే (11) కూడా మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. అయితే ధావన్, కార్తీక్ కలిసి దూకుడుగా ఆడారు. వీరిద్దరు మూడో వికెట్కు 16.3 ఓవర్లలోనే 100 పరుగులు జోడించారు. సున్జముల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధావన్, అదే ఓవర్లో వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. గత మ్యాచ్లో డకౌట్ అయిన కార్తీక్ ఈ సారి చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. జాదవ్ (38 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్)ను సున్జముల్ అవుట్ చేయగా...సెంచరీకి చేరువైన దశలో కార్తీక్ రిటైర్ట్ అవుట్గా తప్పుకున్నాడు. ఆ తర్వాత పాండ్యా జోరు కొనసాగింది. భారీ షాట్లతో 39 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకోగా, చివర్లో జడేజా (36 బంతుల్లో 32; 1 సిక్స్) మరిన్ని పరుగులు జోడించి భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. టపటపా... తొలి 3 ఓవర్లలో బంగ్లా 10 పరుగులు చేసింది. ఆ తర్వాత ఉమేశ్, భువీ ధాటికి కకావికలమైంది. ఉమేశ్ వేసిన నాలుగో ఓవర్లో సర్కార్ (2), షబ్బీర్ (0) అవుట్ కాగా, తర్వాతి ఓవర్లో భువీ, కైస్ (7)ను వెనక్కి పంపాడు. భువనేశ్వర్ మరుసటి ఓవర్లోనే షకీబ్ (7), మహ్ముదుల్లా (0) పెవిలియన్ చేరుకోగా, మొసద్దిక్ (0) వికెట్ ఉమేశ్ ఖాతాలో చేరింది. 7.3 ఓవర్లు ముగిసే సరికే 22/6 స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. -
వార్మప్లో వారెవ్వా
► చెలరేగిన షమీ, భువనేశ్వర్ ► కోహ్లి అజేయ అర్ధ సెంచరీ ► డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం ► న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్ చాంపియన్స్ ట్రోఫీలో తమ సన్నాహాలను టీమిండియా... ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా ఆరంభించింది. ఇప్పటిదాకా జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ల్లోనూ ప్రతీ జట్టు ఇక్కడి ఫ్లాట్ పిచ్లపై అలవోకగా 300కు పైగా పరుగులు సాధించింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య అధికారికంగా జరిగిన రెండు వన్డేల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి తరుణంలో భారత బౌలర్లు తమ సత్తా ఏమిటో చాటి చెప్పారు. వైవిధ్యమైన బంతులతో మాజీ చాంపియన్ న్యూజిలాండ్ను బెంబేలెత్తించారు. రెండేళ్ల అనంతరం బరిలోకి దిగినా తన బౌలింగ్లో పదునేమీ తగ్గలేదని పేసర్ షమీ నిరూపిస్తూ ఆరంభంలోనే కివీస్ వెన్నువిరిచాడు. ఆ తర్వాత జడేజా, భువనేశ్వర్ మిగతా ఆటగాళ్ల భరతం పట్టడంతో కివీస్ కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారీ వర్షం అడ్డుగా నిలిచినా మెరుగైన రన్రేట్ కారణంగా విజయం భారత్నే వరించింది. లండన్: తొలి వార్మప్ మ్యాచ్లోనే భారత జట్టు మెరుగైన ప్రదర్శనను కనబరిచింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ విశేషంగా రాణించింది. దీంతో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 45 పరుగుల తేడాతో నెగ్గింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 38.4 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. రోంచి (63 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్ (47 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు) మాత్రమే ఆకట్టుకున్నారు.భువనేశ్వర్, మొహమ్మద్ షమీ మూడేసి వికెట్లు తీయగా... జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 26 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా వర్షం తగ్గలేదు. అప్పటికి డకవర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం ఖాయం కావడానికి 26 ఓవర్లలో 84 పరుగులుగా ఉంది. టీమిండియా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతో భారత్ నెగ్గినట్టు ప్రకటించారు. చూడచక్కని షాట్లతో అలరించిన విరాట్ కోహ్లి (55 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, శిఖర్ ధావన్ (59 బంతుల్లో 40; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మంగళవారం జరిగే రెండో వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ ఆడుతుంది. రోంచి రాణించినా.. కివీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ రోంచి, జేమ్స్ నీషమ్ బ్యాటింగ్ మినహా మరే మెరుపులూ లేవు. మూడో ఓవర్ నుంచే వీరి వికెట్ల పతనం కొనసాగింది. పేసర్ షమీ కీలక బ్యాట్స్మన్ గప్టిల్ (9)ను అవుట్ చేసి దెబ్బ తీశాడు. ఆ తర్వాత షమీ వేసిన తొమ్మిదో ఓవర్లో రోంచి వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. అయితే కెప్టెన్ విలియమ్సన్ (8), బ్రూమ్లను షమీ పెవిలియన్కు పంపాడు. అటు ధాటిగా ఆడిన రోంచి 42 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... అతడి జోరుకు తొలి 10 ఓవర్లలో జట్టు 70 పరుగులు సాధించింది. ఈ దశలో అతడికి ఇతర బ్యాట్స్మెన్ నుంచి పెద్దగా సహకారం అందలేదు. భారత బౌలర్ల ధాటికి ఆ తర్వాతి కివీస్ 10 ఓవర్లలో కేవలం 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. 15వ ఓవర్లో అండర్సన్ (13)ను భువనేశ్వర్ బౌల్డ్ చేయగా... 21వ ఓవర్లో జడేజా అద్భుత బంతికి రోంచి కూడా బౌల్డ్ అయ్యాడు. దీంతో కివీస్ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. మధ్య ఓవర్లలో నీషమ్ అప్పుడప్పుడు బౌండరీలు బాదుతూ జట్టుకు అండగా నిలవాలని చూసినా వరుసగా వికెట్లు పతనం కావడంతో జట్టు పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కోహ్లి, ధావన్ భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్ కీలకంగా నిలిచారు. రెండో ఓవర్లోనే క్యాచ్ అవుటయ్యే ప్రమాదం నుంచి ధావన్ తప్పించుకోగా ఐదో ఓవర్లో రహానే (7) రూపంలో జట్టు తొలి వికెట్ను కోల్పోయింది. హుక్ షాట్కు ప్రయత్నించిన రహానే స్క్వేర్ లాంగ్ లెగ్లో బౌల్ట్కు దొరికిపోయాడు. ఆ తర్వాత కోహ్లి, ధావన్ జోడి నిలకడగా ఆడుతూ అండగా నిలిచింది. వీరిద్దరి ఆటలో దూకుడు లేకపోయినా అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచారు. అయితే అర్ధసెంచరీ వైపు పయనిస్తున్న ధావన్ను 19వ ఓవర్లో నీషమ్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓవర్ వ్యవధిలోనే దినేశ్ కార్తీక్ కూడా డకౌట్గా వెనుదిరిగాడు. అటు సరిగ్గా 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లికి ధోని (21 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తోడవ్వడంతో స్కోరులో కాస్త వేగం పెరిగింది. బౌల్ట్ బౌలింగ్లో ధోని ఇచ్చిన క్యాచ్ను గ్రాండ్హోమ్ వదిలేయడంతో అది సిక్స్ వెళ్లగా అదే బౌలింగ్లో ఫోర్ కూడా బాది జోరును కనబరిచాడు. కానీ 26 ఓవర్ల అనంతరం కురిసిన వర్షం ఎంతకూ తెరిపినీయకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ను విజేతగా ప్రకటించారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) భువనేశ్వర్ (బి) షమీ 9; రోంచి (బి) జడేజా 66; విలియమ్సన్ (సి) రహానే (బి) షమీ 8; బ్రూమ్ (సి) ధోని (బి) షమీ 0; అండర్సన్ (బి) భువనేశ్వర్ 13; సాన్ట్నర్ (సి) జడేజా (బి) అశ్విన్ 12; గ్రాండ్హోమ్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 4; నీషమ్ నాటౌట్ 46; మిల్నే (సి) ధోని (బి) ఉమేశ్ 9; సౌతీ (బి) భువనేశ్వర్ 4; బౌల్ట్ (సి) షమీ (బి) భువనేశ్వర్ 9; ఎక్స్ట్రాలు 9; మొత్తం (38.4 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–20, 2–63, 3–63, 4–86, 5–110, 6–116, 7–126, 8–156, 9–166, 10–189. బౌలింగ్: షమీ 8–0–47–3; హార్దిక్ పాండ్యా 6–0–49–0; బుమ్రా 4–0–14–0; భువనేశ్వర్ 6.4–1–28–3; జడేజా 4–0–8–2; అశ్విన్ 6–0–32–1; ఉమేశ్ 4–0–11–1. భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) బౌల్ట్ (బి) సౌతీ 7; ధావన్ (సి) అండర్సన్ (బి) నీషమ్ 40; కోహ్లి నాటౌట్ 52; దినేశ్ కార్తీక్ (సి) సాన్ట్నర్ (బి) బౌల్ట్ 0; ధోని నాటౌట్ 17; ఎక్స్ట్రాలు 13; మొత్తం (26 ఓవర్లలో మూడు వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–30, 2–98, 3–104. బౌలింగ్: సౌతీ 7–0–37–1; బౌల్ట్ 7–1–34–1; మిల్నే 4–0–20–0; నీషమ్ 3–0–11–1; గ్రాండ్హోమ్ 5–0–22–0.