breaking news
vangala swamy goud
-
తొలి రోజు 25 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ కాంగ్రెస్ ప్రారంభించింది. ఆదివారం నుంచి ఈ స్వీకరణ ప్రారంభం కాగా, తొలిరోజు పలు లోక్సభ నియోజకవర్గాలకు 25 దరఖాస్తులు వచ్చాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. తొలిరోజు దరఖాస్తు చేసిన వారిలో పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, మల్లు రవి, బలరాం నాయక్, కోదండరెడ్డి తదితరులున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం వరకు కొనసాగనుంది. సోమ, మంగళవారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సోమవారం గాంధీభవన్లో పలు సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి భేటీ కానున్నారు. దీంతో పాటు లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన మీడియా కో ఆర్డినేషన్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ప్రచార కమిటీ, సమన్వయ కమిటీ భేటీలు జరగనున్నాయి. ఈ భేటీల అనంతరం మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లోక్సభకు పోటీచేసేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్లిస్టు చేయనున్నారు. పోటీకి సై అంటున్న సీనియర్లు ఈ సారి కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని మాజీ ఎంపీ వీహెచ్, భువనగిరి సీటు ఇవ్వాలని ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్చైర్మన్ ఎం.కోదండరెడ్డిలు ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. తమ దరఖాస్తులను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్రావుకు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మల్లు రవి (నాగర్కర్నూల్), కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ (మహబూబాబాద్)లు కూడా తమ దరఖాస్తులు అందజేశారు. కాగా, భువనగిరి స్థానం నుంచి టికెట్ కోసం నల్లగొండ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, నల్లగొండ పార్లమెంటు కోసం సూర్యాపేటకు చెందిన పటేల్ రమేశ్రెడ్డి కూడా దరఖాస్తు చేశారు. ఇక, రిజర్వుడు నియోజకవర్గాలైన వరంగల్ నుంచి ఇందిరా, మహబూబాబాద్ నుంచి బెల్లయ్యనాయక్, నాగర్కర్నూల్ నుంచి సతీశ్మాదిగలు కూడా దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. -
టీడీపీలో...ఫిర్యాదుల ముసలం
సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలుగుదేశానికి జిల్లాలో ఏదీ కలిసొచ్చేలా కనిపించడం లేదు. 2009 ఎన్నికల నాటి నుంచి మొన్నటి దాకా నియోజకవర్గా లకు కనీసం ఇన్చార్జులను కూడా నియమించుకోలేని దుస్థితిలో ఆ పార్టీ కొట్టుమిట్టాడింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాగోలా కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించింది. గతేడాది చివరి దాకా జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన వంగాల స్వామిగౌడ్ను హుజూర్నగర్ ఇన్చార్జిగా ప్రకటించారు. సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అధినేతపై ఒత్తిడి చేయడం వల్లే ఆయన పేరు ప్రకటించి, బలవంతంగా తమ నెత్తిన రుద్దారన్నది హుజూర్నగర్ దేశం నేతల బలమైన అభిప్రాయం. ఇన్చార్జిగా నియమితుడయ్యాక కూడా స్వామిగౌడ్ పనితీరు మెరుగు పడలేదని, తమకు అందుబాటులో ఉండడం లేదని, ఏకపక్షంగా మండల అధ్యక్షులను నియమించుకుంటున్నారన్న ఆగ్రహం అక్కడి ద్వితీయశ్రేణి నేతల్లో ఉంది. దీని ప్రభావం సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. నియోజకవర్గంలో గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న పార్టీని అథమ స్థాయికి తీసుకువచ్చారని వీరు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా, స్వామిగౌడ్, అధికార కాంగ్రెస్ పార్టీ నేతతో అంటకాగుతున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో మండలాల వారీగా మెజారిటీ గురించి కూడా ప్రస్తావిస్తున్నారని, తమ పార్టీ నేతలు లోపాయికారిగా ఒప్పందం చేసుకుని సహకరిస్తున్నందు వల్లే అంత ధీమాగా ప్రకటనలు ఇస్తున్నారని, దీనికి తగినట్టే స్వామిగౌడ్ పార్టీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాలన్నింటిపైనా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం హైదరాబాద్కు పలు వాహనాల్లో తరలి వెళ్లిన నియోజకవర్గ టీడీపీ నాయకులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. ఆయనను ఇన్చార్జిగా తొలగించి, కొత్తవారిని నియమించాలని, లేదంటే నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోలేమని మొరపెట్టుకున్నారు. వైఎస్ఆర్ సీపీ గురించి... చర్చ అధికార పార్టీకి ధీటుగా నిలవాల్సింది పోయి, పార్టీ నేతలు కోవర్టుగా మారడంతో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిందని అధినేతకు ఫిర్యాదు చేసిన పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి బాబు వద్ద చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. అధికార కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైందని, ముందు నుంచీ ఉన్న టీడీపీ మాత్రం చతికిల పడేలా తయారైందని వీరు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మండలాల వారీగా, ఇటీవలి సహకార, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు, తెచ్చుకున్న ఓట్లు, తదితరాలపై కూడా వీరు వివరించారని సమాచారం. ఇక, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తేరా చిన్నపురెడ్డిపైనా ఆ నియోజకవర్గ నాయకులు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తలకు చిన్నపురెడ్డి ఏ మాత్రం అందుబాటులో ఉండడం లేదని, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల ఊసు లేకుండా అయ్యిందని ఆ పార్టీ నాయకుడు కటారి అంజయ్య తేరాపై అధినేతకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో ఫిర్యాదుల ముసలం మొదలైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది.