breaking news
tudi devendar reddy
-
అభిప్రాయ సేక‘రణం’
భువనగిరి, న్యూస్లైన్ : కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రూపు విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై సోమవారం ఏఐసీసీ ప్రతినిధి సేవక్ వాఘే పార్టీ నాయకులు, కార్యకర్తలనుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు భువనగిరి రహదారిబంగ్లాలో సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి, ఇన్చార్జ్ కుమార్రావు, సత్యనారాయణలు వేదికపై ఉన్నారు. వారి సమక్షంలోనే పార్టీ కార్యకర్తలు ఇరువర్గాలుగా మారి దాడికి దిగారు. ఈ దాడిలో కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికన్నా సిట్టింగ్లో ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వద్దని ఫిర్యాదులు చేసుకున్నారు. ఒక దశలో పరిశీలకుడు ఫిర్యాదులు కాకుండా పోటీ చేయాలనుకునే వారు తమ పేర్లను ఇవ్వాలని సున్నితంగా ఫిర్యాదులను తిరస్కరించారు. అయినా ఇరువర్గాల కార్యకర్తలు ఎవరూ ఆగలేదు. ఇంతకాలం ఘాటైన విమర్శలు చేసుకుంటూ వచ్చిన ఇరువర్గాలు తిట్ల పురాణం అందుకుని చెప్పులు, కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసురుకోవడంతో పరిశీలకుడు ఉన్న రహదారి బంగ్లా ఆవరణ రణరంగంగా మారింది. పోలీసులు వెంటనే స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, వరంగల్ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంకు చెందిన పలువురు నేతలు తమకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. కాగా పరిశీలకుడు ఆయా నియోజకవర్గాల వారిగా ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్లు బ్లాక్, మండల, యువజన కాంగ్రెస్ అధ్యక్షులనుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎవరి అనుచరులు వారికే... ఎంపీ రాజగోపాల్రెడ్డి పేరును అన్ని నియోజకవర్గాల నుంచి ఆయన అనుచరులు సూచించారు. అలాగే మంత్రి పొన్నాల లక్ష్యయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గూడూరు నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, గర్దాసు బాలయ్య, రాంరెడ్డి దామోదర్రెడ్డి తనయుడు సర్వోత్తమరెడ్డి, దూదిమెట్ల సత్తయ్యయాదవ్ల పేర్లను వారి అనుచరులు సూచించారు. ఆలేరు నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్పేరును అన్ని మండలాల బ్లాక్, మండల కాంగ్రెస్ ప్రతినిధులు సర్పంచ్లు సూచించారు. అలాగే మచ్చ చంద్రమౌళి గౌడ్, వంచవీరారెడ్డి, పల్లె శ్రీనివాస్, పర్వతాలు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గంనుంచి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతోపాటు కొండేటి మల్లయ్య, సాయిలు టికెట్ ఇవ్వాలని కోరారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మామిడి నర్సయ్య, శ్యాంసుందర్లకు టికెట్ ఇవ్వాలని వారి అనుచరులు ఏఐసీసీ దూతకు సూచనలు చేశారు. మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతి, ముంగి చంద్రకళ, సుంకరి మల్లేష్గౌడ్లకు అనుకూలంగా సూచనలు వచ్చాయి. ఇబ్రహీంపట్నం నుంచి క్యామ మల్లేష్, రంగారెడ్డి శేఖర్రెడ్డిల పేర్లను వారి అనుచరులు సూచించారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతల వెంకటేశ్వర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రామాంజ నేయులుగౌడ్, గర్దాసు బాలయ్య, పచ్చిమట్ల శివరాజ్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్, పోతంశెట్టి వెంక టేశ్వర్లు, తంగళ్లపల్లి రవికుమార్, పింగల్రెడ్డిలకు అనుకూలంగా సూచనలు చేశారు. జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాల లక్ష్యయ్య, వైశాలి, మహేందర్రెడ్డి, సత్యనారాయణరెడ్డిలకు అనుకూలంగా వారి అనుచరులు సూచనలు చేశారు. పలుమార్లు ఉద్రిక్తతం అభిప్రాయ సేకరణ సందర్భంగా కార్యకర్తలు బయట పరస్పరం దూషించుకునే విధంగా నినాదాలు చేసుకోవడంతో సమావేశ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ ఇరువర్గాలను సముదాయించారు. పోటా పోటీగా నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో రహదారి బంగ్లా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో నిండిపోయింది. పరిశీలకుని ముందు అభిప్రాయాలు చెప్పే విషయంలో నాయకులు ఇబ్బందులు పడ్డారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేకపోతున్నారని దామోదర్రెడ్డి పరిశీలకునికి ఫిర్యాదు చేశారు. పరిశీలకుని వద్ద ఎవరూ లేకుండా చూడాలని పలుమార్లు పరిశీలకుడిని కోరారు. ఒక దశలో పరిశీలకుని ముందే ఇరువర్గాలు వాగ్వాదం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరువర్గాల కార్యకర్తల నినాదాలతో రహదారి బంగ్లా ప్రాంతం నిండిపోయింది. బయట కార్యకర్తలు ఘర్షణ జరుగుతున్న సమయంలోనే సాయంత్రం వరకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని పరిశీలకుడు బయపడ్డారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రేసు గుర్రం... ఎవరు?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలే గడువు ఉన్న నేపథ్యంలో జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్లో రోజురోజుకూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి నియోజకవర్గాల్లో వారే పోటీ చేసే అవకాశాలు ఉన్నా.. ఈ చర్చ జరగడం విశేషం. ప్రత్యేకించి నల్లగొండ లోక్సభా స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశమే ఎక్కువగా ప్రచారంలో ఉంది. వాస్తవానికి నల్లగొండ సీటు అధికార కాంగ్రెస్ చేతిలోనే ఉంది. గుత్తా సుఖేందర్రెడ్డి ఎంపీగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా, ఈసారి ఎవరు పోటీచేస్తారన్న వార్త ప్రచారంలోకి రావడానికి బలమైన కారణమే కనిపిస్తోంది. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి శాసనసభకు వెళ్లాలన్న వ్యూహంతో ఉన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో బలంగా ముద్ర వేసేందుకు సహకార ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను బాగానే వాడుకున్నారు. ఆయన ప్రయత్నాలను గమనించిన ఎవరైనా ఈసారి ఎమ్మెల్యే పదవికే పోటీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. నల్లగొండ లోక్సభా స్థానం నుంచి రేసులో ఉండేది ఎవరన్న ప్రశ్నకు.. జిల్లా కాంగ్రెస్ వర్గాల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుఖేందర్రెడ్డి పోటీ చేయని పక్షంలో, మంత్రి జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి, జానారెడ్డి తయుడు రఘువీర్రెడ్డి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ వర్గాలు సరైన విశ్లేషణనే ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే పక్షంలో సీఎం పోస్టు రేసులో ఉన్న మంత్రి జానారెడ్డి కచ్చితంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానే పోటీచేస్తారని చెబుతున్నారు. అపుడు, ఆయన తనయుడు రఘువీర్రెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీచేయడానికి ముందుకు వస్తున్నారని అంటున్నారు. జానారెడ్డి నాగార్జున సాగర్ , సుఖేందర్రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే, నల్లగొండ ఎంపీ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి, రఘువీర్రెడ్డి మధ్యనే పోటీ ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఈసారి జానారెడ్డి పార్లమెంటుకు వెళ్లేందుకు నల్లగొండ లోక్సభా స్థానాన్ని ఎంచుకోవచ్చని, అపుడు ఆయన తనయుడు రఘువీర్రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ పరిణామాలేవీ జరగకుండా సుఖేందర్రెడ్డి నల్లగొండ లోక్సభ స్థానం బరిలోనే ఉంటే, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి పోటీ ఉంటుందని అంటున్నారు. కొన్ని సంవ త్సరాలుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ను మంత్రి జానారెడ్డి తన అనుయాయులకే ఇప్పించుకుంటున్నారు. ఈసారి అదే జరిగితే ఆయన తనయుడి వైపు మొగ్గు చూపుతారా..? లేక, పార్టీలోని మరెవరైనా సీనియర్ను ఎంచుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితినే ఎదుర్కునే అవకాశాలే ఎక్కువగా ఉన్నందున తెలంగాణ ప్రాంతంలోని ఒక్కో ఎంపీ సీటు ఎంతో కీలకమవుతుందని, అలాంటప్పుడు ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా సిట్టింగ్ ఎంపీలనే మళ్లీ బరిలోకి దింపుతుందని కూడా కాంగ్రెస్ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి నల్లగొండ ఎంపీ సీటు విషయం ఇపుడు కాంగ్రెస్లో రక రకాల వార్తల ప్రచారానికి కారణమవుతోంది.