సింగరేణి వీఆర్ఎస్ డిపెండెంట్ల దీక్ష భగ్నం
- శిబిరాన్ని తొలగించిన పోలీసులు
గోదావరిఖని: సింగరేణి సంస్థలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ వీఆర్ఎస్ డిపెండెంట్లు చేస్తున్న దీక్షను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని జీఎం కార్యాలయం ఎదుట 129 రోజులుగా చేస్తున్న దీక్షలకు బ్రేక్ వేశారు. దీక్షాశిబిరం టెంట్ను తొలగించిన పోలీసులు దీక్ష చేస్తున్న వీఆర్ఎస్ డిపెండెంట్ల సంఘం అధ్యక్షులు అర్కుటి శంకర్, నూనె శ్రీనివాస్, గోరుపాటి రాము, బయ్య గట్టయ్య, జాన్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డిలను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
సింగరేణి సీఎండీ శ్రీధర్ను త్వరలో కలిసిన తర్వాత శిబిరాన్ని ఎత్తివేస్తామని డిపెండెంట్లు తెలిపినా పోలీసులు వినకుండా టెంట్ను కూల్చివేశారు. ఈ సందర్భంగా వీఆర్ఎస్ డిపెండెంట్లు మాట్లాడుతూ 1997 నుంచి 2001 వరకు వీఆర్ఎస్ తీసుకున్న కార్మికుల వారసులుగా తమకు ఉద్యోగాలిస్తామని గత ప్రభుత్వం, సింగరేణి యూజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత మోసం చేయడం శోచనీయమన్నారు.