breaking news
Shiva Rama Krishna Committee
-
తీరంలో అన్నింటా ముప్పే
* ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్ల తాకిడి అధికమే * నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, విశాఖ , శ్రీకాకుళం, విజయనగరాల్లో తుఫాను గాలుల ప్రభావం ఎక్కువ * కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలపై తరచుగా వరదల ప్రభావం * సముద్ర మట్టం పెరుగుదలవల్ల కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఉప్పునీరు చొరబాటు * గణాంకాలు, గ్రాఫులు, మ్యాపులతో విశ్లేషించిన శివరామకృష్ణన్ కమిటీ * అన్ని అంశాలను పరిగణించి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని సూచన సాక్షి, హైదరాబాద్: తూర్పు తీర ప్రాంతంలో తరచూ సంభవించే తుఫాన్లు, భూకంపాలు తదితర విపత్తులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ఇందుకోసం కమిటీ ప్రతి అంశాన్ని గణాంకాలు, అధ్యయనాలు, గ్రాఫ్లు, మ్యాపులతో సహా నివేదించింది. కమిటీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలిలా ఉన్నాయి. ఏతూర్పు తీర ప్రాంతంలో ప్రమాదాలు, విపత్తులు ఎక్కువగా సంభవించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్ల ధాటి అధికం. గడిచిన దశాబ్దంలో రాష్ట్రంలో తుఫాన్లు సంఖ్య అధికంగానే నమోదయ్యాయి. ప్రతి రెండేళ్ళకోసారి రాష్ట్రం తుఫాను ధాటికి గురవుతూనే ఉంది. నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాల్లో తుఫాను గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సముద్రం మట్టం పెరుగుదలతో ఉప్పునీరు ఆంధ్ర తీరంలోని గోదావరి, కృష్ణా డెల్టాల్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఏ ఏపీలో డెల్టా, తీర ప్రాంతాల్లో వరదలు తరచు సంభవిస్తున్నాయి. కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు కృష్ణా, గోదావరి నదుల తీరాన కేంద్రీకృతమై ఉన్నాయి. 2009 అక్టోబరు-నవంబరులో వచ్చిన వరదలు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వరదల బారిన పడే నగరాల్లో విజయవాడ, గుంటూరు, నెల్లూరులు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ క్యాపిటల్ జోన్ చుట్టూ ఉన్న అంశాన్ని గమనించాలి. ఏ మిగిలిన తీర ప్రాంత నగరాలతో పోలిస్తే విశాఖపట్టణానికి రక్షణ ఉంది. ఇక్కడ టోపోగ్రఫీ, కోస్టల్ లైన్ ఇందుకు కారణం. ఈ పట్టణ, నగరాలతో పోలిస్తే క్యాపిటల్ జోన్లో భవిష్యత్తులో పలు తుఫాన్లకు, సూపర్ సైక్లోన్స్కు ప్రాణ నష్టం, భవనాల డ్యామేజీ, వ్యాపార ఆటంకాలు అనేకమున్నాయి. ఏ రాష్ర్టంలో సగటున వార్షిక వర్షపాతం 1000 మిల్లీమీటర్లుగా నమోదవుతోంది. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కరువు ఛాయలు అధికం. ఇక్కడ 30 మండలాల్లో 40 శాతం కంటే అధికంగా తరచూ కరువు ఉంటుంది. 20-40 శాతం కరువు బారిన పడే 115 మండలాల్లో అధికంగా ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలున్నాయి. వీజీటీఎంకు భూకంప ప్రమాదం ఆంధ్రప్రదేశ్ భూకంపాలకు సంబంధించి జోన్-2, 3 లలో ఉంది. ఇది తక్కువ ప్రభావమే చూపుతుంది. కానీ విజయవాడ పరిసరాల్లోని 150 కిలోమీటర్ల రేంజ్లో భూకంప ప్రమాదాలకు ఆస్కారం ఉందని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) జరిపిన సీస్మిక్ మైక్రో-జోనేషన్ అధ్యయనంలో వెల్లడైంది. ఇదంతా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) రీజన్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలు పొంచి ఉన్నందున దాన్ని గమనంలోకి తీసుకుని నిర్ణయాలు జరగాలి. 1917లో విజయనగరంలో 5.5 ఎం, 1967లో ఒంగోలు ప్రాంతంలో 5.4 ఎం.గా రెండు పెద్ద భూకంపాలు నమోదయ్యాయి. కాకినాడ, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రిలలో తక్కువ రిస్క్గా ఉన్నాయి. తక్కువ నాణ్యతతో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడితే మాత్రం ప్రమాదం అధికంగా ఉంటుంది. అహ్మదాబాద్లో 2001లో భుజ్ భూకంపమే దీనికి ఉదాహరణ. -
ప్రత్యేక హోదాతోనే ఏపీకి గ్రాంటు
రాజధాని కోసం రూ. 1,35,349 కోట్లు ఆశిస్తున్న ఏపీ 14వ ఆర్థికసంఘాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: పధ్నాలుగో ఆర్థిక సంఘం నుంచి భారీ గ్రాంటును రాబట్టుకోవాలని యత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది ప్రత్యేక హోదా లభిస్తేనే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఏపీ ప్రభుత్వం 14వ ఆర్ధిక సంఘంనుంచి రూ.1,35,349 కోట్ల గ్రాంటును ఆశిస్తోంది. అందుకు అనుగుణంగా 14వ ఆర్థికసంఘం పెద్ద మొత్తంలో 90 శాతం మేర గ్రాంటుకు సిఫారసు చేయాలంటే అంతకు ముందుగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాల్సి ఉంది. కానీ ఈ అంశంపై కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు కదలికలు కనిపించడం లేదు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రాజ్యసభలో ప్రకటన చేస్తూ విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు. ఎన్నికలయిపోయి కేంద్రంలోను, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు ఎటువంటి కదలికలు లేవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక హోదా కల్పించకుండా 90 శాతం మేర గ్రాంటుకు ఆర్థికసంఘం సిఫారసు చేయదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆర్థికసంఘం అక్టోబరు నెలాఖరుకల్లా సిఫారసులతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించిందని.. ఆ లోగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోతే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున గ్రాంటు పొందకుండా నష్టపోతామని ఆందోళన వ్యక్తంచేశారు. సెప్టెంబరులో సమావేశం ఆర్థిక సంఘం సెప్టెంబర్ 10 - 15 తేదీల మధ్య రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల కోసం హైదరాబాద్ రానుంది. ఈలోగానే సంఘానికి మొమోరాండం పంపించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శనివారం జరిపిన సమీక్షలో ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాలకు ఆదేశాలు జారీచేశారు. విభజన నేపధ్యంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వీలైనంత మేర నిధులు పొందేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి విద్య, వైద్య సంస్థలతో పాటు పలు రంగాలకు చెందిన సంస్థల ఏర్పాటుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి పొందాలంటే ఆర్థికసంఘానికి ప్రతిపాదనలు సమర్పించాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా..కొత్త రాజధాని మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1,35,349 కోట్ల కేంద్ర గ్రాంటుకు సిఫారసు చేయాల్సిందిగా 14వ ఆర్థికసంఘాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర రాజధాని జోన్లుగా ఎంపికయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై డీటీసీపీ (డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) విభాగం అధికారులు కమిటీకి ఈ ఏడాది జూలైలో కొంత సమాచారాన్ని అందచేశారు. ఇందులో ముసునూరు ఒక్కటే ఏలూరుకు దగ్గరగా ఉంది. మిగిలిన ప్రాంతాలు పులిచింతల, మాచర్ల, బొల్లాపల్లి, వినుకొండ, మార్టూరు, దొనకొండ, మంగళగిరి. అయితే మునిసిపల్ శాఖ పంపిన ఈ ప్రతిపాదనలన్నీ అనధికారిమేనని, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదని పేర్కొన్నట్లు శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది.