breaking news
Sharing scheme
-
ఉన్నత విద్యలో ‘షేరింగ్’
సాక్షి, అమరావతి: సెంట్రల్ వర్సిటీలు సహా దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోని వనరులను సద్వినియోగం చేయడం, సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలు కూడా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టింది. వివిధ సదుపాయాలతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన ఇతర అంశాల్లో విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి వీలుగా టెక్నాలజీని, ఇతర వనరులను ఆయా సంస్థలు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు ఈ విధానం దోహదపడనుంది. సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలిచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పరిశోధన కోర్సుల్లోనూ దీన్ని అమలుచేయాలని సూచించింది. వనరులు లేని విద్యాసంస్థలు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలేకుండా దగ్గర్లోని విద్యా సంస్థల వనరులను వినియోగిస్తూ తమ విద్యార్థులను ఆయా సంస్థలు తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది. రెట్టింపు ఫలితాలు ఈ విధానంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని యూజీసీ భావిస్తోంది. అకడమిక్ అంశాలు సహా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను సమగ్రంగా అమలుచేయాలంటే అదనపు సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు అదనపు పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా.. ఇప్పటికే ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యాసంస్థలు పరస్పర సహకారంతో విద్యాపరమైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల విద్యార్థులకు సమానమైన విద్య అందుతుంది. ప్రస్తుతం ల్యాబ్లు, లైబ్రరీలు, ఇతర వనరులున్న సంస్థల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ, అలాంటివిలేని సంస్థల విద్యార్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. వనరులను పంచుకునేలా ఆయా సంస్థల మధ్య జరిగేఒప్పందాలతో విద్యార్థులందరికీ మేలు చేకూరుతుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులన్నిటికీ ఈ విధానాన్ని అమలుచేయాలని యూజీసీ సూచించింది. ఆయా విద్యాసంస్థలన్నీ తమ సంస్థలోని తరగతి గదులు, ల్యాబ్లు ఇతర వనరుల సమాచారాన్ని సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ తెలిసేలా వెబ్సైట్ ద్వారా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వీటిని వినియోగించుకోవాలనుకునే ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి నిర్దిష్ట వనరులకు సాధారణ కనీస ఛార్జీలు నిర్ణయించి వసూలుచేయవచ్చని సూచించింది. ఆ కనీస ఛార్జీల వివరాలూ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సంస్థల మధ్య ఒప్పందాలు ఇక ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను పరస్పర భాగస్వామ్యంతో వినియోగించుకునేందుకు వీలుగా ఆయా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకోవాలని యూజీసీ పేర్కొంది. ఏ సమయంలో ఏ సంస్థ విద్యార్థులు వనరులు వినియోగించుకోవాలో సమగ్ర టైమ్టేబుల్ను రూపొందించి ఆ ప్రకారం కార్యక్రమాలకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్లు, ఇతర వనరులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సంస్థలు చర్యలు చేపట్టాలని, ఏ ఒక్క తరగతి ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ విధానంతో విద్యార్థులకు మేలు.. తరగతి గదులు, మౌలిక సదుపాయాలు పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది. క్రీడా మైదానాలు, స్టేడియం, సమావేశ మందిరాలను కూడా అవసరాలను అనుసరించి పంచుకోవచ్చు. సైన్సేతర అంశాలకు సంబంధించిన వనరుల విషయంలో కూడా సంస్థలు పూర్తిస్థాయిలో తమ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. పరికరాలు దెబ్బతినే విషయంలోనూ వాటిని తిరిగి ఏర్పాటుచేయడంపైనా ఒప్పందంలో పేర్కొనాలి. అకడమిక్ అంశాలకు సంబంధించి ఆన్లైన్ లెక్చర్లు, వీడియోలు, లెర్నింగ్ మెటీరియల్లు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లలోనూ ఇచ్చిపుచ్చుకోవచ్చు. విద్యార్థుల నమోదు ప్రక్రియ మొత్తం ముందుగా ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ద్వారా పూర్తిచేయాలి. ఉపాధ్యాయుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. ఖర్చులపై ముందుగానే ప్రణాళిక వనరులను పంచుకోవడానికి ముందు వ్యయ విశ్లేషణ, ఖర్చును నిర్ణయించే పద్ధతులపై ప్రణాళిక రూపొందించుకోవాలి. లాభనష్టాలకు తావులేని రీతిలో వనరుల వినియోగంపై ఛార్జీలు వసూలుచేయాలి. ప్రయోగాల వినియోగం ఆధారంగా, నిర్వహణ వ్యయం ప్రకారం పరికరాలు ఛార్జీలు నిర్ణయించాలి. ఉన్నత విద్యాసంస్థల మధ్యే కాకుండా కాలేజీలు, పరిశ్రమల మధ్య కూడా ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. -
చెరువులు ఇలా.. సాగు ఎలా?
గజ్వేల్, న్యూస్లైన్: ఆయకట్టుదారుల భాగస్వామ్యంతో చెరువులను అభివృద్ధిచేయాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. చెరువులకు కొత్త రూపు తీసుకొచ్చేందుకు నాలుగేళ్ల కిందట చేపట్టిన సామూహిక చెరువుల యాజమాన్య భాగస్వామ్య పథకానికి అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో నాణ్యాతాలోపించడంతో ఎక్కడికక్కడ చెరువుకట్టలు దెబ్బతిని గండ్లు పడే ప్రమాదం నెలకొంది. ఫలితంగా సాగు, చెరువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని 192 నీటిపారుదల శాఖ చెరువులను అభివృద్ధి చేసేందుకు సామూహిక భాగస్వామ్య యాజమాన్య పథకం ద్వారా అప్పటి ప్రభుత్వం 2008లో రూ. 42.80 కోట్ల నిధులను విడుదల చేసింది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్, కొండపాక మండలాల్లోని 46 చెరువుల అభివృద్ధికి రూ. 9.92 కోట్లు మంజూరు చేశారు. 5 శాతం ఆయకట్టుదారుల శ్రమదానం, మరో 5 శాతం ఆయకట్టుదారుల వాటాతో నిధులు విడుదల చేశా రు. ఈ నిధులతో చెరువుల కట్టల ఎత్తు పెం పు, అలుగు, తూములు, కాల్వల నిర్మాణం తదితర పనులను చేపట్టడానికి నిర్ణయించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడంతో ఆందోళన కలిగిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన 46 చెరువు పనుల్లో నాణ్యత లోపించదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మారెడ్డిపల్లిలోని పల్లె చెరువు పనులు కూడా సక్రమంగా చేపట్టలేదు. కట్ట నిర్మాణం పటిష్టంగా జరగకపోవడం వల్ల రెండున్నరేళ్ల క్రితం నుంచే మట్టి తొలగిపోతూ భారీగా కోతలు ఏర్పడి గండ్లు పడే ప్రమాదం పొంచివుంది. ఈసారి వర్షాలు తక్కువగా కురవడంవల్ల చెరువులోకి పావు వంతు కూడా నీరు చేరలేదు. పూర్తిగా నిండి ఉంటే కట్ట తెగిపోయేదని చెరువు కింద ఉన్న 193 ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర్మారెడ్డిపల్లి పల్లెచెరువే కాదు.. నియోజకవర్గంలో ఈ పథకం కింద చేపట్టిన అన్ని చెరువుల పనుల్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.