breaking news
The seventh Nizam
-
ఆయన ఆస్తి.. దేశ బడ్జెట్ కంటే రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: ఆయన ఆస్తి భారతదేశ బడ్జెట్కు రెండింతలు.. సొంత విమానాశ్రయం, సొంత రైల్వే, సొంత బ్యాంకు.. అప్పట్లో ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు..మిలమిలా మెరిసే 185 కేరెట్ల జాకబ్ వజ్రం ఆయన బల్లపై పేపర్ వెయిట్..1937లో ఫిబ్రవరి 22న టైం మేగజైన్ కవర్పేజీపై ‘రిచెస్ట్ మెన్ ఇన్ ది వరల్డ్’ పేరుతో ప్రచురితమైన కథనం ఆయనదే... ఆయనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. అసఫ్జాహీ వంశంలో చివరి రాజు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ స్టేట్ను పాలిస్తున్న రాజు. 1940వ దశకంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డుపుటల్లోకి ఎక్కిన ఏడో నిజాం.. ప్రపంచ నలుమూలలకూ మేలిమి వజ్రాలను సరఫరా చేసినవాడిగా కూడా రికార్డు సాధించారు. అదే ఆయనను ప్రపంచ ధనికుడిని చేసింది. అమెరికా మొత్తం సంపదలో రెండు శాతంతో సమంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంపద ఉండేది. అప్పట్లోనే ఆయన సంపద విలువ రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అప్పుడు భారతదేశ వార్షికాదాయం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే. అంతేకాదు హైదరాబాద్ సంస్థానం బడ్జెట్ అప్పట్లోనే రూ.కోట్లలో ఉండేది. మొత్తం బడ్జెట్లో 11 నుంచి 15 శాతం దాకా విద్యా రంగానికే కేటాయించే వారు. ఇళ్లకు విద్యుత్ వెలుగులు, నిజాం విశ్వవిద్యాలయం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి భవనం, నిజాం చక్కెర కర్మాగారం.. ఇవన్నీ ఆయన బడ్జెట్ కానుకలే. ప్రస్తుతం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’గా కొనసాగుతున్న బ్యాంకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సొంతంగా స్థాపించిన బ్యాంకే. -
‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా..
* సైనిక చర్యకు తలవంచిన ఏడో నిజాం * రజాకార్ల ఆగడాలు అంతమైన రోజు * స్వేచ్ఛావాయువులు పీల్చిన హైదరాబాదీలుభారత్ వశమైన హైదరాబాద్ సంస్థానం * ‘సెప్టెంబర్ 17’ ప్రత్యేకం సాక్షి, సిటీబ్యూరో: 1947లో దేశానికి స్వాతంత్య్ర వచ్చినా హైదరాబాదీలు మాత్రం రజాకార్ల ఆగడాలకు బలయ్యారు. వారి వేధింపు లను భరించలేక విసిగి వేసారి పోయారు. విముక్తి కోసం కలలుగన్నారు. వారు అనుకున్నట్టుగానే 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు లొంగుబాటుతో ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చారు. భారత సైన్యం నలువైపుల నుంచి హైదరాబాద్ను ముట్టడించడంతో ఎట్టకేలకు ఏడో నిజాం వెన్నుచూపాడు. హైదరాబాద్ సంస్థానం భారత్లో కలవడంతో జనమంతా పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. మువ్వన్నెల జెండాలతో పరుగులు తీశారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున ‘ఆపరేషన్ పోలో’ పేరిట సైనిక చర్యకు దిగింది. అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లబ్భాయి పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం నాలుగు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ.రుద్ర మద్రాస్ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ను ముట్టడించింది. అయినా చివరి క్షణం వరకు నిజాం ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగించింది. సెప్టెంబర్ 14న: దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్ , వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ దాడిని ఎదిరించలేక నిజాం సైనికులు పరుగులు తీశారు. కనిపించిన రోడ్లను, వంతెనలను ధ్వంసం చేశారు. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఆకాశంలో తిరుగుతున్న భారత యుద్ధ విమానాలకు తమ ఉనికి తెలిస్తే బాంబులు వేస్తారనే భయంతో రజాకార్లు ఇళ్లల్లో లైట్లు ఆర్పేయాలని హెచ్చరించారు. సెప్టెంబర్ 16న: ఆ రోజు రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల వశమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. కానీ సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న: ఆ రోజు సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్లోకి ప్రవేశించడంతో నగర వాసుల్లో ఉత్సాహం ఉరకలేసింది. అడుగడుగునా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కు భారత సైన్యం కవాతు చేసింది. అదే రోజు సాయంత్రం రేడియో ప్రసంగంతో.. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రసంగించారు. ‘నా ప్రియమైన ప్రజలారా!.. నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. ఈ పని ఇదివరకే చేయాల్సింది. ఆలస్యమైనందుకు విచారిస్తున్నా. యుద్ధం నుంచి నా సైన్యాన్ని విరమించుకుంటున్నా. ఐక్యరాజ్యసమితిలో పెట్టిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నా’ అని ప్రకటించారు. ఆ మరుసటి రోజు ఆయన గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని క లిశారు.