breaking news
Rail Yatri
-
నో వెయిటింగ్..కన్ఫర్మేషనేనా!
న్యూఢిల్లీ: బుక్ చేసుకున్న రైల్వే టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు రెట్టింపయ్యాయని రైల్ యాత్రి అనే ఓ ట్రావెల్ వెబ్సైట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2015 దీపావళి పండుగ రోజు 25.5 శాతం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు రద్దు కాగా, ఇది 2016 నాటికి 18 శాతానికి తగ్గిపోయింది. ఈ ఏడాది దీపావళి నాటికి ఇదే పరిస్థితి కొనసాగిందని దీనిబట్టి చూస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అయినట్లేనని పోర్టల్ తెలిపింది. డెహ్రడూన్–హౌరా డూన్ ఎక్స్ప్రెస్కు కన్ఫర్మేషన్ రేటు 20 శాతం మేర పెరిగింది. పుణె–జమ్మూ తావి జీలం ఎక్స్ప్రెస్ కు 12 శాతం, గయా మీదుగా వెళ్లే ముంబై సీఎస్టీ –హౌరా సూపర్ ఫాస్ట్ మెయిల్కు 11 శాతం కన్ఫర్మేషన్ రేటు పెరిగినట్లు వివరించింది. ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టడమే కారణమని తెలిపింది. -
‘రైల్ యాత్రి’లో నీలేకని పెట్టుబడులు
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్(యాప్), వెబ్సైట్ రైల్యాత్రి.ఇన్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ మొత్తం ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. నీలేకనితోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లయిన హీలియన్ వెంచర్స్, ఒమిడ్యార్ నెట్వర్క్స్, బ్లూమ్ వెంచర్స్ కూడా తాజాగా పెట్టుబడులు పెట్టిన వాటిలో ఉన్నాయని రైల్యాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. 2014లో ఆరంభమైన రైల్యాత్రి ఇప్పటివరకూ 3 మిలియన్ డాలర్లను(దాదాపు రూ.20 కోట్లు) సమీకరించినట్లు అంచనా. రైళ్లలో ప్రయాణిస్తున్నవారి(క్రౌడ్ సోర్సింగ్) మొబైల్ జీపీఎస్ డేటా ఆధారంగా రైళ్లకు సంబంధించిన ప్రయాణ జాప్యాలను ఈ యాప్ అంచనావేసి ఇతర ప్రయాణికులకు అందిస్తుంది. సంబంధిత రైలు ఏ ప్లాట్ఫామ్పైకి వస్తుంది. కోచ్ పొజిషన్, ఆన్-టైమ్ హిస్టరీ, వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ గనుక తీసుకుంటే అది కన్ఫర్మ్ అవుతుందా లేదా వంటి సమాచారాలను కూడా ఈ యాప్తో తెలుసుకోవచ్చు. ఆధార్ పాజెక్టును విజయవంతం చేసిన యూఐడీఏఐ మాజీ చైర్మన్ నీలేకని వంటి టెక్నోక్రాట్ నుంచి పెట్టుబడులు అందుకోవడం తమకు గర్వకారణమని రైల్యాత్రి సహ వ్యవస్థాపకుడు కపిల్ రైజాదా వ్యాఖ్యానించారు.