breaking news
Phirangipuram quarry blast
-
ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం ఘటన
హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం క్వారీ ఘటన చోటుచేసుకుందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. -
ఫిరంగిపురం క్వారీ ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
గుంటూరు : ఫిరంగిపురం క్వారీ ఘటనపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాగా ఈ రోజు ఉదయం ఫిరంగిపురం కొండల్లో అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో.. కొండ చరియలు, రాళ్లు, మట్టిపెళ్లలు మీదపడి ఆరుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకు చెందినవారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. కాగా, క్వారీ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు... మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.