breaking news
Null
-
కలిసి జీవిస్తే సరిపోతుందా?.. విడాకులెలా కోరతారు?
మన దేశ చట్టాల్లో భూతద్దం పెట్టి చూసిన దొరకని ‘సహజీవనం’ అనే బంధం గురించి ఆసక్తికరమైన తీర్పు ఒకటి వెలువడింది. సహజీవనంలో ఉన్న ఓ జంట విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే చట్టం ప్రకారం అది పెళ్లి కానప్పుడు.. విడాకుల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ఓ జంటను ప్రశ్నించింది కేరళ హైకోర్టు. ఏ చట్టంలోనూ కలిసి ఉంటే పెళ్లి అని లేదు. ఇద్దరి మనసులు కలిసాయని సహజీవనం చేసేవాళ్లకు విడాకులు అడిగే హక్కే లేదు. కేవలం పర్సనల్, సెక్యులర్ చట్టం ప్రకారం వివాహం జరిగినప్పుడే దానికి గుర్తింపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం కలిసి జీవించినా.. అది వివాహం కిందకు రాదని, విడాకులకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది బెంచ్. చట్టం ప్రకారం ఒక్కటైన జంటలకు మాత్రమే విడాకులు తీసుకునే హక్కు మన చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా పిటిషనర్లకు కోర్టు గుర్తుచేసింది. 2006 నుంచి వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. పైగా తమ బంధానికి సంబంధించి ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. ఓ బిడ్డనూ కన్నారు. ఈ క్రమంలో మనస్పర్థలతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే.. చట్ట ప్రకారం వివాహం కానప్పుడు విడాకులు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తూ పిటిషన్ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఆ జంట. చట్టం ప్రకారం సహజీవనానికి గుర్తింపు లేదు. కలిసి ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు విడిపోవడానికి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇది వీలుకాని విషయం. చట్టంలోనూ అందుకు వెసులుబాటు లేదు అని జస్టిస్ ముహమ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సోఫీ థామస్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు తీరుపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టం ద్వారా గుర్తించబడిన వివాహాలకు సంబంధించిన దావాలను మాత్రమే స్వీకరించే పరిధి ఫ్యామిలీ కోర్టులకు ఉందని, పై పిటిషన్ను విచారణకు తీసుకుని కొట్టేసే బదులు.. పిటిషన్ నిర్వహణ సాధ్యం కాదని ముందుగానే పిటిషన్ను తిరస్కరించి ఉండాల్సిందని, తద్వారా కోర్టు సమయం వృథా కాకుండా ఉండేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇది రూ.10 మర్డర్ కేసు.. చదివేయండి! -
మనసుకు కనులుంటే..
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న 15వ కథనమిది... ప్రపంచాన్ని మనసుతో సందర్శించే నిష్కల్మషులు వారు. రంగులకు, హంగులకు శూన్యంలోనే కొత్త భాష్యం చెప్పగలరు. పుట్టుకతోనే చూపు కరవైనా హృదయరాగంతో దైవాన్ని నేరుగా చూడగలిగే భాగ్యవంతులు. ఆ రాగాలను ఒడిసిపట్టి.. వాటికో రూపమిచ్చి.. ఆ గానామృతాన్ని వారికే కానుకగా అందజేస్తే.. ఈ ఆలోచన వచ్చిన మహిళ వందన. హైదరాబాద్ మలక్పేట వాసి అయిన వందన అంధుల ‘మనసుకు కనులుంటే’ ఏం చూపుతారో.. ఆ కళ్లలో దాగున్న కలలేంటో.. కమ్మని పాటలుగా వారి నోటనే పలికించారు. ఆ పాటల ఆల్బమ్ని వారికే కానుకగా ఇచ్చారు. గృహిణిగా బాధ్యతలను నెరవేరుస్తూనే తనదైన కళతో రాణించాలనుకున్నారు వందన. చదువుకునే రోజుల్లోనే లలిత సంగీతంలో రాణింపు, సాహిత్యంపై మక్కువ ఆమెలోని కళాభిరుచిని రెట్టింపు చేశాయి. ఆ కళాసాధనలో ఉండగా తెలిసిన వారితో రెండేళ్లక్రితం ఒకసారి మలక్పేట్లోని అంధ పిల్లల హోమ్ని సందర్శించారు. ఆ సమయంలోనే అక్కడ వసతుల కోసం ఎంతో కొంత సాయం చేయాలనిపించింది. అయితే అలా ఇచ్చిన సొమ్ముతో తాత్కాలికంగా కొన్ని వసతులు ఏర్పడతాయేమో కానీ, అవి అక్కడి పిల్లలకు పెద్ద ప్రయోజనం తెచ్చేది మాత్రం ఏమీ లేదని గుర్తించారామె. గాత్రానికి ప్రాణం... మనిషి రూపు రేఖలు వారికి తెలియవు. ఏది మంచి, ఏది చెడు పట్టదు. కదిలిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు. చూపు లేకపోయినా తమదైన లోకంలో విహరింపజేస్తారు. కమ్మని గాత్రంతో ఆకట్టుకుంటారు. కొంతమంది పిల్లల గానానికి పరవశించడంతో వారితోనే ఒక ఆడియో ఆల్బమ్ చేసి, దానిని వారికే కానుకగా ఇవ్వాలనుకున్నారు. అందుకు ఖర్చు, టైమూ బోలెడంతవుతుంది. అయినా ఆ లేత మనసుల్లో నుంచి వచ్చే గానాన్ని ఒడిసిపట్టాలనుకున్నారు. అందుకు ఆరుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకున్నారు. భాగ్య, ప్రియాంక, సోని, మనీషా, సౌమ్య, గాయత్రిలను బృందంగా తయారు చేశారు. వీరు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నారు. రేయింబవళ్లూ సాధన... ‘మనసుకు కనులుంటే..’ ఆల్బమ్ ద్వారా అంధులైన వారి నోట పలికే ఒక్కో పాట పూదోటలో గుబాళింపులా మనసును తడుతున్నాయి. ‘వేయి కనులు కావాలా... వేల్పును కొలిచేందుకు.. మది మందిరమైన చోట కొలువుండడా వేల్పు...’ ఎక్కడెకిళ్లినా ఇప్పుడా ఆల్బమ్లోని పాటలు పాడుతూ వేదికల మీదా తమదైన గానామృతాన్ని పంచుతున్నారు. ‘ఆల్బమ్కి అవసరమైన ఆరు పాటలు పాడించడానికి దాదాపు ఆరునెలలు కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇది కష్టమనుకోను. నా జన్మ ధన్యంగా భావిస్తాను. చూపులేని వారి హృదయపు లోతుల్లోకి వెళ్లి, వారి భావాలతో ఆరు పాటలు రాశా. వాటికి సంగీతాన్ని అందించమని కోరినప్పుడు రామాచారి వెంటనే ఒప్పుకున్నారు. పిల్లలకు రోజూ సంగీతంలో క్లాస్లు ఇప్పించి, రిహార్సల్స్ చేయించి, రికార్డింగ్ స్టూడి యోకి తీసుకెళ్లా. ఈ ప్రయత్నానికి బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సహకారాన్ని అందించారు. పిల్లలు కూడా నాతో బాగా కలిసి పోయి, అద్భుతంగా పాటలు పాడారు. ఆ తర్వాత తమ గొంతును ఆల్బమ్ పాటలలో విని, ఎంతో సంతోషించారు. ఇప్పుడా ఆల్బమ్కి వచ్చే ప్రతి రూపాయి వారి ఖాతాలోనే జమ అవుతుంది. అలా వచ్చిన డబ్బు వారి అవసరాలను ఎంతో కొంత తీర్చుతుంది. రాబోయే రోజుల్లో అంధుల చేత వీడియో ఆల్బమ్ ఒకటి చేయాలనే సంకల్పంతో ఉన్నాను’ అని తెలిపారు వందన. గానంతో సందర్శన... ఈ పాటలు పాడిన వారిలో ప్రియాంక మాట్లాడుతూ... ‘శూన్యమైన మా లోకంలో వందన వెలుగు నింపారు’ అంటూనే - ‘మమతల కోవెలలో... మానవీయ లోగిలిలో.. విరిసిన కుసుమాలమే మేమూ! ఓ చల్లని మనసు మాకు తోడుంటే .. లాలనగా ఓ చేయి మము నడిపిస్తే.. గగనాలైనా ఇలకు దించి చూపమా’ అంటూ గానంతోనే తన అభిప్రాయాన్ని తెలిపింది. ‘రంగులంటే ఎలా ఉంటాయో తెలియదు. దైవాన్ని చూడలేము. అయినా ఈ పాటల ద్వారా అవన్నీ మేం సందర్శించాం. చూపు లేదని చిన్నచూపు చూడకుండా మా మనసుతో దర్శించిన దైవాన్ని (పాటలను) మీరూ వినండి’... ఇది సోని మాట. నిర్మలారెడ్డి ఫొటో: జి.రాజేష్