CBSE లోపాల ఎపిసోడ్: జాక్పాట్ కొట్టిన కుర్రాడు
ప్రభుత్వ వెబ్సైట్ల జోలికి పోవడం నేరం. అలా ఎవరైనా వెళ్తే.. కేసులు పెడతారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు మాత్రం అదే పనితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీబీఎస్ఈ మార్కుల అప్లోడ్ పోర్టల్లో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ అధికారి.. అటు ప్రముఖుల నుంచి, ఇటు నెటిజన్ల నుంచి శెభాష్ అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు అతనికి మరో ‘ప్రతిష్టాత్మక’ అవకాశం దక్కింది.దేశంలోని పాఠశాలలు విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేసే సీబీఎస్ఈ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ మార్క్స్ (OSM) పోర్టల్లో భద్రతా లోపాలు ఉన్నాయని తొలిసారిగా గుర్తించింది 19 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి. అయితే చాలామంది చేసేలా ఆ లోపాలను దుర్వినియోగం చేయకుండా, బాధ్యతాయుతంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సీబీఎస్ఈ డిజిటల్ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇటీవల మరోసారి సీబీఎస్ఈ డిజిటల్ వ్యవస్థలపై దృష్టి సారించిన నిసర్గ.. మరో సంచలన ప్రకటన చేశాడు. "బ్యాడ్ ఆపిల్" అనే వైరల్ యానిమేషన్ను ఒక సీబీఎస్ఈ పోర్టల్లో ప్రదర్శించగలిగానని చెబుతూ భద్రతా లోపాలను ప్రస్తావించాడు. దీంతో సైబర్ భద్రత అంశం మళ్లీ వార్తల్లో నిలిచింది.అయితే.. నిసర్గ ప్రతిభను గుర్తించిన ఐఐటీ కాన్పూర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ పరిశోధనా కేంద్రం సీ3ఐహబ్ ఆ కుర్రాడిని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్గా నియమించింది. ఒక సాధారణ సైబర్ రీసెర్చర్గా ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు దేశంలోని అగ్రశ్రేణి సైబర్ రక్షణ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగంగా మారడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.C3iHub అనేది IIT కాన్పూర్లో ఉన్న ఒక ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్. ఇది క్యాంపస్ బయట కాదు.. పూర్తిగా ఐఐటీ కాన్పూర్ లోపలే పనిచేస్తుంది. కానీ ఇది సాధారణ డిపార్ట్మెంట్ ఉద్యోగం కాదు—ప్రత్యేకంగా సైబర్ దాడులు, డేటా భద్రత, హ్యాకింగ్ విధానాలు వంటి అంశాలపై పరిశోధన చేసే ప్రాజెక్ట్ కేంద్రం. అందులో పనిచేసే నిసర్గ లాంటి వారు నేరుగా క్లాస్లు లేదా టీచింగ్ డిపార్ట్మెంట్లో కాకుండా, ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ టీమ్లో ఉంటారు. వారి పని ప్రభుత్వ, బ్యాంకింగ్, రక్షణ వ్యవస్థల డిజిటల్ భద్రతను మెరుగుపరచడం, సైబర్ ముప్పులను ముందే గుర్తించడం వంటి పనులపై ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఇదొక హై-లెవల్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్/సెంటర్.జీతం ఎంతంటే..ఇలాంటి నియామకాలు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రాజెక్ట్ ఆధారిత కాంట్రాక్ట్ పోస్టులుగా ఉంటాయి. ఐఐటీ కాన్పూర్ వంటి సంస్థల రీసెర్చ్ కేంద్రాల్లో పనిచేసే వారికి నెలవారీ స్టైపెండ్ లేదా జీతం అందుతుంది. జూనియర్ స్థాయి రీసెర్చ్/ఇంజినీర్ పోస్టులకు సాధారణంగా నెలకు సుమారు రూ.50 వేల నుంచి రూ.1,20,000 దాకా వేతనం ఉండొచ్చు. ఇది అభ్యర్థి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ప్రాజెక్ట్ ఫండింగ్పై ఆధారపడి మారుతుంది. నిసర్గ లాంటి ప్రత్యేక ప్రతిభ ఉన్నవారికి మార్కెట్ రేంజ్ కంటే మెరుగైన ప్యాకేజ్ కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన జీతం వివరాలు సాధారణంగా పబ్లిక్గా ప్రకటించరు.ఇన్స్పిరేషన్ కాదంటారా?నేటి డిజిటల్ ప్రపంచంలో సైబర్ దాడులు, డేటా చోరీలు, ర్యాన్సమ్వేర్ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో థ్రెట్ ఇంటెలిజెన్స్ నిపుణుల అవసరం కూడా గణనీయంగా పెరుగుతోంది. హ్యాకర్లు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు? భవిష్యత్తులో ఎలాంటి ముప్పులు ఎదురుకావచ్చు? అనే అంశాలను ముందుగానే గుర్తించి సంస్థలకు హెచ్చరించే బాధ్యత వీరిపై ఉంటుంది. నిసర్గ నియామకం మరో విషయాన్ని స్పష్టం చేస్తోంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో కేవలం డిగ్రీలే కాదు.. ప్రాక్టికల్ నైపుణ్యం, పరిశోధనా దృక్పథం, నైతిక విలువలు కూడా సమానంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ఒక ప్రభుత్వ పోర్టల్లో లోపాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా వెల్లడించిన యువకుడు.. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్లో కీలక బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యువతకు సైబర్ సెక్యూరిటీ రంగంలో కొత్త దిశను చూపుతోంది.