breaking news
new political policy
-
బీమా చెల్లించకుంటే రాకండి
వాషింగ్టన్: అమెరికా వెళ్ళేందుకు సమాయత్తమౌతోన్న వేలాది మంది భారతీయుల ఆకాంక్షలపై ట్రంప్ తాజా ఆదేశాలు నీళ్ళు చల్లుతున్నాయి. ఆరోగ్యబీమా ఉన్నదని రుజువు చేసుకోలేని వారినీ, వైద్యఖర్చులను భరించలేని వారినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వీసానిరాకరణ నిర్ణయం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆరోగ్యబీమా లేకుండా, వైద్యబిల్లులు చెల్లించే ఆర్థిక స్థోమత లేకుండా అమెరికాలోకి అడుగుపెట్టే వలసదారులను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారంతేల్చి చెప్పారు. అంతేకాకుండా అమెరికా ఆరోగ్య వ్యవస్థపై అదనపు భారం కాబోమని నిరూపించుకున్న వారినే అనుమతించాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. అమెరికా పౌరుల్లోకంటే ఆరోగ్యబీమా లేని చట్టబద్దమైన ప్రవాసులు మూడు రెట్లు అధికంగా ఉన్నట్టు ట్రంప్ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ఆరోగ్యవ్యవస్థకీ, పన్నులు చెల్లిస్తోన్న అమెరికా పౌరులకువలసదారుల వల్ల ఖర్చు పెరగకూడదని ట్రంప్ భావిస్తున్నట్టు వైట్ హౌస్ వెల్లడించారు. -
కొత్త ‘ఫిరాయింపు’ సిద్ధాంతం
కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఆందోళన న్యూఢిల్లీ: అధికార పార్టీలోకి ఫిరాయిస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయనే, నేరాలన్నీ సమసిపోతాయనే భావన పెరిగిపోతోందని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వ్యాఖ్యానించారు. ‘అధికార పార్టీలోకి ఫిరాయిస్తే తాను చేసిన నేరాలతో పాటు అన్ని అపరాధాలు తొలగిపోతాయనే భావనలో ఉన్నారు. ఈ తరహా కొత్త రాజకీయ విధానం బాగా విస్తరిస్తోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల సభ్యులను తమవైపు తిప్పుకోవడం, డబ్బులు వెదజల్లి ఆకర్షించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి బెదిరించడం మొదలైనవి తెలివైన రాజకీయ నిర్వహణగా చెప్పుకోవడం పరిపాటిగా మారిందన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, మీడియా, ప్రజా సంఘాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వల్ల ఎన్నికల వ్యవస్థలోకి నల్లధనం ప్రవేశించే అవకాశం ఉందన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఎన్నికలు, రాజకీయ సంస్కరణలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన సదస్సులో రావత్ ప్రసంగించారు. ప్రైవేటు పీఆర్ సంస్థలు డబ్బులు తీసుకుని సోషల్ మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు చురుకుగా పనిచేస్తున్నాయి. దీనిపై ఈసీ దృష్టికి సారించింది. సోషల్ మీడియా పాలసీని రూపొందిస్తోంది’ అని రావత్ వెల్లడించారు.