breaking news
Navodayam program
-
నవోదయానికి నీరసం
జిల్లాను సారా రహిత ప్రాంతంగా మారుస్తామని ప్రకటించిన యంత్రాంగం నిధుల విషయంలో ఇబ్బందులు పడుతోంది. సారా తయారీ, రవాణా, అమ్మకాల ప్రాంతాల్లో గ్రామ సభలు పెట్టి కౌన్సెలింగ్ ద్వారా వారిలో మార్పు తీసుకువస్తామని భావిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఖర్చు విషయంలో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఫిబ్రవరి 10న జిల్లా వ్యాప్తంగా ‘నవోదయం’ ప్రారంభించారు. లక్ష్యం మంచిదే గానీ, నిధులే ఇబ్బందిగా మారిందని అధికారులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా అధికారి పరిధిలో ఇప్పటివరకు కేవలం రూ.1లక్షే మంజూరైందని, ఆంధ్ర-ఒడిశా ప్రాంతాల్లో భారీగా దాడులు చేస్తున్న తమకు గ్రామస్తుల కౌన్సెలింగ్ కోసం, జనాన్ని చైతన్యం చేసేందుకు డబ్బు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ః రాష్ట్రాల సరిహద్దుల్లో ఇరు వర్గాల అధికారులు సమీక్షించుకుని సారా రహిత ప్రాంతాలుగా చేయాలన్నది ప్రభుత్వ ధ్యేయం. నవోదయం కార్యక్రమం ప్రకటించకముందు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బంది సహాయంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని సారా విక్రయ, తయారీ కేంద్రాలపై విరుచుకుపడ్డారు. బెల్లంఊటల్ని, సారా బట్టీలను ధ్వంసం చేశారు. ఏజెన్సీలోని శివారు ప్రాంతాలకూ మఫ్టీలో వెళ్లి సారా తయారీపై ఉక్కుపాదం మోపారు. అనంతరం ఇరు రాష్ట్రాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు తాజా పరిస్థితులపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని భావించారు. రెండు నెలలవుతున్నా ఇది పూర్తికాలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ యథాతథస్థితే కనిపిస్తోందంటూ సిబ్బంది వాపోతున్నారు. ఒడిశా ప్రభుత్వ సహాయంతో సరిహద్దులోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ దాడులు నిర్వహించామని ఇప్పుడు జిల్లాలోనేఫలితాలు సాధించాల్సి ఉందని అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మక గ్రామాలు 109 జిల్లా వ్యాప్తంగా ఆరు మండలాల పరిధిలో 109 సమస్యాత్మక గ్రామాల్ని గుర్తించారు. సోంపేట, పాలకొండ, పాతపట్నం, కొత్తూరు, టెక్కలి, పలాస పరిధిలో ఆయా సీఐలు సారా రహిత ప్రాంతాలుగా మార్చాలంటే మరింత పకడ్బందీగా వ్యవహరించాలంటున్నారు. జనం కూడా సహకరిస్తేనే ఫలితాలు సాధించగలం అని చెబుతున్నారు. ఈ మేరకు ఆరుగురు సీఐల్ని ప్రత్యేక బృందంగా గుర్తించి తాజాగా అబ్కారీశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లక్ష్యాలిచ్చారు. వీఆర్వోలు, హెడ్మాస్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు గ్రామసభలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేయించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బెల్లం వ్యాపారులకూ కౌన్సెలింగ్ చేస్తున్నారు. పాల కొండ పరిధిలో రెల్లివీధి, పాలకొండ టౌన్, వీరఘట్టంలోని బీసీ కాలనీ, సీతంపేట పరిధిలో నారాయణగూడ, యాద, సోంపేట పరిధిలో మందస వంటి ప్రాంతాల్లో ‘మాసివ్ రైడ్స్’ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇవీ ఫలితాలు నిధుల ఇబ్బంది ఉన్నా అధికారులు పలుచోట్ల లక్ష్యాల సాధనకు గ్రామస్తుల సహకారంతో పాటుపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 82ఐడీ (ఇల్లీసిట్ డిస్టిల్ల్డ్ లిక్కర్)కేసుల్ని నమోదు చేశారు. 37మందిని అరెస్టు చేశారు. సీఆర్పీసీ 110చట్టం కింద 125మందికి బైండోవర్ విధించారు. 2,375లీటర్ల సారాను, 125లీటర్ల వాష్ను థ్వంసం చేశారు. 1లక్ష23వేల 750లీటర్ల బెల్లం ఊటను థ్వంసం చేశారు. 90కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాల్ని అదుపులోకి తీసుకున్నారు. 112చోట్ల గ్రామసభలు నిర్వహించారు. కేటగిరీలివీ పాలకొండ పరిధిలో ఏ (సారా తయారీ, రవాణా, విక్రయం) కేటగిరీల కింద 5ప్రాంతాల్ని గుర్తించగా బీ (స్మాల్ స్కేల్ విక్రయాలు) కేటగిరీ కింద ఏడు ప్రాంతాల్ని, సీ (ఎక్కడో తయారీ, ఇక్కడ అమ్మకాలు) కేటగిరీ కింద మరో 7ప్రాంతాల్ని (మొత్తం 19గ్రామాలు) గుర్తించారు. పాతపట్నం పరిధిలో ఏ కింద 8, బీ కింద 10, సీ కింద ఏడు మొత్తం 25గ్రామాల్నీ, కొత్తూరు పరిధిలో ఏ కేటగిరీ కింద 5, బీ కింద ఆరు, సీ కింద 9, మొత్తం 20గ్రామాల్ని గుర్తించారు. టెక్కలి పరిధిలో ఏ కేటగిరీ కింద మూడు, బీ కింద 2, సీ కింద 9, మొత్తం 14గ్రామాల్నీ, పలాస పరిధిలో సీ కేటగిరీ కింద 6గ్రామాల్ని, సోంపేట పరిధిలో ఏ కింద 2, బీ కింద 15, సీ కింద 8, మొత్తం 25గ్రామాల్నీ ఇలా..మొత్తం 7మండలాల పరిధిలో 109గ్రామాల్ని గుర్తించి ఆరుగురు సీఐల్ని ప్రత్యేకంగా నియమించారు. ఖర్చు విషయంలో ఎలా చేయాలో తెలియక అధికారులు తికమక పడుతున్నారు. బైండోవర్లు నేరం చేస్తే కఠిన చర్యలే గతంలో నేరం చేసిన నిందితులు మళ్లీ తప్పు చేస్తే వారు ప్రభుత్వానికి చేసిన డిపాజిట్ మొత్తం వెనక్కు రాకుండా అప్రమత్తం చేస్తున్నాం. నేరం చేసినందుకు మళ్లీ కేసులు నమోదు చేస్తాం. తహశీల్దార్ వద్ద ఫైన్ చెల్లించేలా చేస్తున్నాం. జిల్లాను సారా రహిత కేంద్రంగా ప్రకటించేందుకు ఎంతో దూరం లేదు. కొన్ని ఇబ్బందులున్నా అధిగమించే ప్రయత్నం చేస్తాం. శివప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం. -
నవోదయం వచ్చేనా..?
* సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్శాఖ ప్రయత్నం * జోరుగా చైతన్యం విజయనగరం రూరల్: సారారహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఎక్సైజ్శాఖ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఎంత కట్టడి చేస్తున్నా నాటుసారా తయారీ, అమ్మకాల జోరు తగ్గడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నాటుసారా తయారీ జోరుగా ఉండడంతో గిరిజన ప్రజల ఆరోగ్యం గుల్లవుతోంది. నాటుసారా అమ్మకాలు, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం ‘నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు 45 రోజుల పాటు ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, అటవీశాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ర్యాలీలు, విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి సారా రక్కసిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని రాష్ట్ర, జిల్లా సరిహద్దు గ్రామాలు, గిరిజన గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారీ జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా గత ఏడాది జూలై నుంచి జనవరి వరకు ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో 109 కేసులు నమోదు చేసి 103 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 80 కుటుంబాలు నాటుసారా తయారీలో పాలుపంచుకుంటున్నట్లు ఎక్సైజ్ అధికారుల సర్వేలో తేల్చారు. తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో సుమారు నాలుగు వందల మంది ప్రత్యక్షంగా నాటుసారా అమ్మకాల్లో పాలుపంచుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. నాటుసారా తయారీకి ఉపయోగించే లక్ష లీటర్ల బెల్లం ఊటను గత ఏడు నెలల కాలంలో ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలు, అమ్మకందారులను గుర్తించి ఆయా గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు నవోదయం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చైతన్య కార్యక్రమాలు జిల్లాలో గుర్తించిన నాటుసారా తయారీదారులను, అమ్మకందారులను అదుపులోకి తీసుకుని అవగాహన కార్యక్రమాలు, కళాజాతాలు నిర్వహించి ఎక్సైజ్, రెవెన్యూ, పోలీసులు వారిచేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. వినకుంటే వారిపై కఠిన చర్యలకు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వారి రేషన్కార్డులు, ఆధార్కార్డులు, ఇంటి కరెంట్ను రద్దు చేసే యోచనలో ఉన్నారు. జరిమానా ఫీజును సైతం అయిదు రెట్ల వరకు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కమిటీల ఏర్పాటు నవోదయం కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్గా సభ్యులుగా ఎస్పీ, డీఎఫ్వో, కన్వీనర్గా ఎక్సైజ్శాఖ సహాయ కమిషనర్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఉంటారు. అలాగే మండల కమిటీలో తహశీల్దార్ చైర్మన్గా సీఐ, ఎస్సై, ఎంపీడీవో, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉంటారు. గుర్తించిన గ్రామాల్లో ప్రజలను ఇందులో భాగస్వాములు చేస్తారు. 80 గ్రామాల్లో నవోదయం జిల్లాలో 30 గ్రామాల్లో సారా తయారీ, 50 గ్రామాల్లో సారా అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో నవోదయం కార్యక్రమం అమలు చేస్తున్నారు. విజయనగరం డివిజన్ పరిధిలోని కొత్తవలస ఎక్సైజ్ సర్కిల్, ఎస్.కోట సర్కిల్, నెల్లిమర్ల సర్కిల్, పార్వతీపురం డివిజన్ పరిధిలో పార్వతీపురం, కూనేరు చెక్పోస్టు, సాలూరు సర్కిల్లో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. వీటని గ్రేడ్లుగా విభజించి నవోదయం కార్యక్రమం అమలు చేస్తున్నారు. సారారహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం సారా రహిత రాష్ట్రంలో భాగంగా నవోదయం కార్యక్రమంతో జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం. సారా తయారీ, అమ్మకందారులను అదుపులోకి తీసుకుని వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరుస్తాం. మాట వినని వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. - వై.చైతన్య మురళి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్శాఖ