breaking news
market department
-
ఇదేమి చిత్రం!
విజయవాడ సిటీ మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఉంది మార్కెట్ శాఖ అధికారుల తీరు. కనీస వసతులు లేక అధ్వానంగా మారిన జిల్లా రైతుబజార్ల నుంచి వచ్చిన ఆదాయాన్ని మార్కెటింగ్ శాఖకు బదలాయించడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని ఒకవైపు జిల్లా వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో మార్కెటింగ్కు శాఖకు బదిలీ చేయడం తగదని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలోని రైతుబజార్ల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇక్కడే పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రైతులు, స్టాళ్ల నిర్వాహకులు కోరుతున్నారు. నిధుల మళ్లింపుపై ఉన్న ధ్యాస.. అభివృద్ధిపై లేదా.. ఈ ఏడాది జిల్లాలోని రైతుబజార్లలో వచ్చిన ఆదాయం రూ.1.50కోట్లను వారం రోజుల కిందట మార్కెటింగ్ శాఖకు బదలాయించారు. ఇక్కడి రైతుబజార్లలో కనీస వసతులు లేక స్టాళ్ల నిర్వాహకులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా నిధులను బదలాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో 17 రైతుబజార్లు ఉన్నాయి. వాటిలో 12 రైతుబజార్లలో కనీస వసతులు లేవు. స్టాల్స్ లేకపోవడంతో డేరాలు కట్టుకుని ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రెండో అతి పెద్దదైన నగరంలోని స్వరాజ్యమైదానం రైతుబజార్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పటమట, కేదారేశ్వరిపేట, సింగ్నగర్లలోని రైతుబజార్లు పల్లపు ప్రాంతంలో ఉండటంతో వర్షాకాలం నీటిలో నానుతున్నాయి. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, జగ్గయ్యపేటలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, ఫ్లోరింగ్, తాగునీరు సరిగా లేక స్టాళ్ల నిర్వాహకులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్బందిపైనా చిన్నచూపే! జిల్లాలోని రైతుబజార్లలో 19 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి కనీస వేతనాలు అందడం లేదు. పట్టణాల్లో పనిచేసే ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.14వేలు, రూరల్ ప్రాంతాల వారికి రూ.13వేలు, సిబ్బందికి పట్టణాల్లో రూ.6,735, మున్సిపాలిటీల్లో రూ,5,735, పంచాయతీల్లో పనిచేసేవారికి రూ.5వేలు చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. సిబ్బందికి డ్రస్ కూడా ఇవ్వడం లేదు. కార్యాలయాల్లో కంప్యూటర్లు, ఫోన్లు ఏర్పాటుచేయలేదు. ఇక్కడ వచ్చిన ఆదాయంతో రైతుబజార్లను ఆభివృద్ధి చేయాలని, విడిపోయే ఉమ్మడి రాష్ట్రానికి వర్తించేలా మార్కెటింగ్ శాఖకు బదలాయించడం తగదని రైతులు అంటున్నారు. -
మార్కెట్లో అధికారుల నిర్బంధం
కేసముద్రం, న్యూస్లైన్ : రెండు జతల యూనిఫాంల పంపిణీపై ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కేసముద్రం మార్కెట్ హమాలీలు బుధవారం కార్యాలయంలో అధికారులను నిర్బంధించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట బిక్షపతి మాట్లాడుతూ మార్కెట్లో వెట్టిచాకిరీ చేస్తున్న హమాలీ కార్మికులకు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంలేదని ఆరోపించారు. రైతులకు నిరంతరాయంగా సేవలందిస్తున్న కార్మికులకు ఏటా రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేస్తామని చెప్పినా ఇంతవరకు దానిని ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పారు. యూనిఫాంల విషయంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ఆందోళనను విరమించేదిలేదని తెలిపారు. దీంతో మార్కెట్ అధికారులు విషయాన్ని జేడీ దృష్టికి తీసుకెళ్లారు. ఏడాదికి రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పడంతో కార్మికులు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ నాయకుడు దండు శ్రీను, హమాలీ యూనియన్ నాయకులు మాసం వెంకటయ్య, బండారు వెంకన్న, బొడ్డు వెంకన్న, సరోజన, రాధ, యాకుబ్, రాజు పాల్గొన్నారు.