breaking news
The Mahabharata
-
విశ్వ భారతం
తపోదీక్షలో ఉన్న వ్యాసుడికి ఉన్నట్టుండి సృజన ఉప్పొంగుతుంది. మానవజాతి చరిత్రను కావ్యరూపంలో రాయ సంకల్పించి, తనకు లేఖకుడిగా కౌమార బాలుడైన పరీక్షిత్తును ఉండమంటాడు. పరీక్షిత్తుకు తన పూర్వీకులను అతి దగ్గరగా పరిచయం చేయడం వ్యాసుడి ప్రాథమికోద్దేశం. మనుషుల అతి సంక్లిష్టమైన స్వభావాలను చిత్రించడం ద్వారా మానవజాతికి తమ ఉనికి పట్ల ఒక జాగరూకతను కలిగించడం పరమ లక్ష్యం. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగింది సర్వనాశనమే. ఇంతటి మహోన్నత కార్యం కాబట్టే, సాక్షాత్తూ దేవుడే(గణేశుడు) స్వయంగా వ్యాసుడికి లేఖకుడిగా కుదురుకుంటాడు. ఇటీవల మరణించిన రంగస్థల దిగ్గజం పీటర్ బ్రూక్ దర్శకత్వం వహించిన ‘ద మహాభారత’, తానూ ఒక పాత్రగా ఉన్న భారతాన్ని వ్యాసుడు రాయడానికి పూనుకోవడంతో ప్రారంభమవుతుంది. మనకు మహాభారతం కొత్తది కాదు. మన సారస్వతం మహాభారతంతో ప్రభవించింది. మన రంగస్థలం మహాభారతంతో సంపన్నమైంది. మన చిత్రసీమ మహాభారతంతో పదునెక్కింది. ‘తత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా, ఆధ్యాత్మవిదులు వేదాంతంగా, నీతివిచక్షణులు నీతిశాస్త్రంగా, కవులు మహాకావ్యంగా, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహంగా, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయంగా’ గౌరవించే ఇతిహాసం ఇది. ‘ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిదేదీ ప్రపంచంలో లేదు.’ అందుకే బయట తలెత్తిన సమస్యకు మహాభారతంలో సమాధానం వెతకడానికి ప్రయత్నించాడు ఇంగ్లండ్కు చెందిన ‘పద్మశ్రీ’ పీటర్ బ్రూక్(1925–2022). వియత్నాంతో అమెరికా యుద్ధం జరిగిన తర్వాతి విధ్వంసం బ్రూక్కు మహాభారతం మీద ఆసక్తిని కలిగించింది. ప్రతి పాత్రా రక్తమాంసాలతో, తనవైన బలహీనతలతో ఉండి, యుద్ధ బీభత్సాన్ని అనివార్యం చేస్తుంది. ప్రతి మనిషీ సృష్టి విధ్వంసంలో ఏదో ఒక మేరకు పాత్రను పోషిస్తూనే ఉంటాడు; అందుకే అందరూ ఈ ప్రపంచానికి ఉమ్మడిగా బాధ్యులేనని పీటర్కు నమ్మకం కలిగింది. దాన్నే విశ్వ యవనిక మీద ఎలుగెత్తి చాటాడు. క్లాసిక్స్ను స్టేజీ మీదకు తేవడంలో రంగస్థలానికి ప్రమాణాలు నెలకొల్పిన పీటర్ బ్రూక్ ‘అవర్ గ్రేటెస్ట్ లివింగ్ థియేటర్ డైరెక్టర్’ అనిపించుకున్నాడు. భారతం కోసం ఫ్రెంచ్ రచయితలైన జాన్ క్లాడ్ కారియేరీ, మేరీ హెలెనా ఏస్తియన్తో జట్టు కట్టాడు. ఎందరో సంస్కృత పండితులను కలిశారు. ఎనిమిదేళ్ల శ్రమ తర్వాత పన్నెండు గంటల నాటకంగా భారతం రూపొందింది. 1985లో తొలి ప్రదర్శన జరిగింది. పదహారు దేశాలకు చెందిన నటీనటులతో నాలుగేళ్లపాటు వీరి బృందం అమెరికా నుంచి ఆఫ్రికా గ్రామాల వరకూ పర్యటించింది. ముంబయి నగరానికీ వచ్చింది. తెలుపు, నలుపు, గోధుమ వర్ణాల నటులతో ఇది నిజంగానే ప్రపంచ నాటకంగా మారిపోయింది. ‘లార్డ్ ఆఫ్ ద ఫ్లైస్’ లాంటి సినిమాతో సినీ దర్శకుడిగానూ ప్రసిద్ధుడైన బ్రూక్ తన నాటకం ఆధారంగానే 1989లో ఐదున్నర గంటల టెలివిజన్ సిరీస్గా ‘ద మహాభారత’ రూపొందించారు. ఆయన్ని అంచనా కట్టడానికి మనకు ఇప్పుడున్న సోర్సు ఇదే! ‘మ..హా..భా..ర..త్..’ అంటూ దూరదర్శన్ ద్వారా 94 వారాల ధారావాహికను ఇంటింటికీ పరిచయం చేసిన బీఆర్ చోప్రాకు ముందు, లేదా సమాంతరంగా బ్రూక్ అనుసృజన మొదలైంది. మొదటి సీన్ నుంచే మనకు అలవాటైన భారతాన్ని చూడటం లేదని అర్థమైపోతుంది. ద్రౌపది(మల్లికా సారాభాయి) లాంటి ఒకట్రెండు పాత్రలు తప్ప ఎవరూ భారతీయులు కాదు. సెట్టింగులు తక్కువ, ఆభరణాలు అత్యల్పం, కిరీటాలు లేవు, పరిచారికలు కనబడరు, జయజయ ధ్వానాలు శూన్యం, రాజకుమారులందరూ షేర్వానీలు తొడుక్కుంటారు. మహామహా యోధులు బారులు తీరిన చివరి యుద్ధ ప్రారంభ సూచికగా అర్జునుడు శంఖం ఊదినప్పుడు కనబడేది మహా అయితే రెండు తెల్ల గుర్రాలు మాత్రమే. ఒక భారీ విజువల్ ఫీస్ట్ దీన్నుంచి ఆశించలేం. కానీ పీటర్ బ్రూక్ గొప్పతనం ఎక్కడంటే, అవేవీ లేకుండానే ఆ ఉద్వేగాన్ని పలికించగలగడం. రంగస్థలం మీద ఒక ఖాళీ స్థలంలో నువ్వొక విశ్వాన్ని చూపగలవు; నటుడి చేతిలోని ఒక కర్ర, ఒక సీసా, లేదా ఖాళీ మద్య పాత్రతో ఎంతో చేయొచ్చునంటాడు బ్రూక్. ఆ స్ఫూర్తి ఇందులోనూ కనబడుతుంది. కథను వర్తమానంలో చూపడం కంటే జరిగిపోయినదాన్ని వ్యాసుడు నెరేటర్గా చెబుతుండటం వల్ల ఇందులో ఉన్నదేదీ ఇక లోపంగా కనబడదు. కృష్ణుడు నీలవర్ణంలో ఉండకపోవడం, భీష్ముడంతటివాడిని కూడా మనవలు పేరు పెట్టి పిలవడం భారతీయ పద్ధతికి దూరం. గన్నేశా, సత్యవత్తి లాంటి ఉచ్ఛారణలు భారతీయేతరుల పరిమితి. వీటికంటే కూడా భారత వారసత్వాన్ని దొంగిలిస్తున్నాడని పీటర్ నిందలు ఎదుర్కొన్నాడు. అయితే, భారతం ప్రపంచానికి చెందినదని తన ప్రయత్నాన్ని సమర్థించుకున్నాడు. మడుగులో నీళ్లు తాగడానికి అనుమతి ఇచ్చేముందు యక్షుడు అడిగే ప్రశ్న: ‘ఈ ప్రపంచానికి కారణం ఏమిటి?’ దానికి ధర్మరాజు సమాధానం: ‘ప్రేమ!’ ఇదే సర్వకాలావసరం. సాహిత్య ఆదాన ప్రదానాలకు కారణమయ్యే, అన్ని ప్రాంతాల వైవిధ్యమైన కథనాలను ప్రపంచం వినగలిగేట్టు చేసే సాంస్కృతిక దూతలు ఎప్పుడూ అవసరమే. మనుషులను అర్థం చేసుకోవడం ద్వారానే మనుషులు మారగలరు. -
వెయ్యి కోట్లు.. రెండు భాగాలు
వెయ్యి కోట్ల భారీ చిత్రానికి వచ్చే ఏడాది జూలైలో ముహూర్తం కుదిరింది. మోహన్లాల్ ప్రధాన పాత్రలో రూపొందనున్న బహు భాషా చిత్రం ‘రన్డామూళమ్’. జ్ఞానపీuЇ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ నవల ‘రన్డామూళమ్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో బీఆర్ శెట్టి నిర్మించనున్నారు. ఈ సినిమాకు మలయాళంలో ‘రన్డామూళమ్’, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో ‘ది మహాభారత’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ‘‘ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో సెట్స్పైకి వెళ్లనుంది. కొందరు ఇండియన్ ఫేమస్ యాక్టర్స్ ఇందులో నటిస్తారు’’ అన్నారు నిర్మాత. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమా తొలి పార్ట్ను 2020లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
శ్రీ కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్..!
-
శ్రీ కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్..!
బాహుబలి సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న సమయంలో మరో భారీ చిత్రం వార్తల్లో నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వాసుదేవనాయర్ రచించిన రంథమూలం నవల ఆధారంగా మహాభారత గాథని తెరకెక్కిస్తున్న సంగతి తెలసింది. ప్రముఖ వ్యాపారవేత్త బిఆర్ శెట్టి 1000 కోట్ల బడ్జెట్తో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండగా, యాడ్ ఫిలిం డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. 2018లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. సినిమాలో కీలకమైన భీముడి పాత్రలో మోహన్ లాల్ నటిస్తుండగా.. శ్రీకృష్ణుడి పాత్రకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సంప్రదిస్తున్నారు. మహేష్ ఈ పాత్రకు ఒప్పుకోని పక్షంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ ను శ్రీకృష్ణుడి పాత్రకు ఒప్పించాలని భావిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాను 2020లో తొమ్మిది నెలల గ్యాప్లో రెండు భాగాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
ఆదికవి... ఆదర్శకావ్యం
రామాయణం, మహాభారతం భారతీయుల జీవనంతో ముడివేసుకుని అవిచ్ఛిన్నంగా ప్రయాణం సాగిస్తున్నాయి. విరగకాచిన చెట్లకొమ్మల్లో ఫలాలను తిని తన్మయత్వంతో పాడే కోయిలలా, రాముడి గురించి తెలుసుకున్న వాల్మీకి పరవశంతో మధురమైన అక్షరాలతో రామాయణాన్ని గానం చేశాడు. తమసానదీ తీరంలో వాల్మీకి నోటి వెంట వెలువడిన తొలి శ్లోకాన్ని మొట్టమొదట విన్నవాడు శిష్యుడు భరద్వాజుడు. గురువర్యా! ఈ శ్లోకం రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా, పదే పదే మననం చేసుకోవడానికి సులభంగా ఉందే అని భరద్వాజుడు పులకింతల్లో మునిగిపోతాడు. ధర్మం కోసం, ధర్మనిష్ట లో జరిగే సంఘర్షణ లో మంచివైపు నిలబడడం కోసం, ఆడిన మాట తప్పకుండా ఉండడం కోసం, స్నేహం విలువ తెలుసుకోవడం కోసం, అన్నదమ్ముల అనురాగాల సౌధాల కోసం, ఒక్క మాటలో చెప్పాలంటే రామరాజ్యం కోసం రామాయణాన్ని చదవాలి. వాల్మీకి మహర్షి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. కవిగా వాల్మీకి భారతీయ సాహిత్యానికి దారిదీపం. మబ్బులు, కొండలు, కోనలు, చెట్లు, పూలు, పక్షులు యావత్ ప్రపంచాన్ని ఒక్క అక్షరం ఎక్కువ - తక్కువ కాకుండా తన రచనలో అద్దం పట్టడంలో వాల్మీకికి సాటిరాగల వారులేరు. ఉపమా కాళిదాసస్య అని అలంకారాల్లో తనదైన ముద్రవేసిన కాళిదాసాదులు వాల్మీకి చూపిన బాటలో నడిచినవారే. మానసిక ప్రవృత్తులు, అంతర్మథనాలు, ధర్మాధర్మ విచక్షణ మీద వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు వాల్మీకి హిమవత్పర్వతం కంటే ఎత్తులో ఉంటాడు. వాల్మీకి ఆదికవి - రామాయణం ఆదికావ్యం. ప్రపంచ ఇతిహాసాల్లో రామాయణం ఎప్పటికీ చర్చనీయాంశమే. యుగాలు మారుతున్నా, కాలధర్మాలు మారుతున్నా, జీవన వేగం రాకెట్లతో పోటీ పడుతున్నా వాల్మీకి రామాయణం నిలిచి వెలుగుతూనే ఉంది. ధర్మ పరాయణులకు దారిచూపుతూనే ఉంది. మిన్ను విరిగి మీద పడ్డా ధర్మాన్ని వదలకుండా ఎందుకు నిలబడాలో చెబుతూనే ఉంది. అలజడి లేని కొలనులో తేట నీరు పైకితేలి ప్రశాంతంగా ఉన్నట్లు వాల్మీకి మనసు అత్యంత ప్రశాంతంగా ఉన్న సమయంలో తారసపడ్డ వ్యక్తులు, సంఘటనలు, ఉదయించిన ప్రశ్నల్లో నుండే రామాయణం పుట్టింది. కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు, సత్య ధర్మ పరాక్రమవంతుడు... ఇలా సకల గుణ సంపన్నుడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మనసు వెతుకుతోంది. ఆ సమయంలో ఎదురైన నారదుడిని స్పష్టంగా అదే అడిగాడు వాల్మీకి. ఎందుకు లేడు? అయోధ్యలో రాముడున్నాడు అని వాల్మీకికి నారదుడు రామదర్శనం చేయించాడు. ఇక వాల్మీకి మనసు ఆగలేదు. అదే ధ్యాస, అదే స్మరణ, అదే పులకింత, అదే సర్వస్వం. ఫలితం - శ్రీ రామాయణం. మనం రామాయణాన్ని పారాయణ చేయాలని, సీతారామ హనుమలను పూజించాలని మాత్రమే వాల్మీకి రామాయణం చేశారనుకుంటే మనం ఆ మహర్షి గౌరవాన్ని తగ్గించిన వాళ్లం ్లఅవుతాం. ఆయనే ఒకచోట మారీచుడి చేత చెప్పించినట్లు రామో విగ్రహవాన్ ధర్మః అని ధర్మాన్ని పోతపోస్తే రాముడి రూపమవుతుంది. నేను లేనప్పుడు అమ్మ కైకేయి వరంగా తీసుకున్న రాజ్యం, నేను అడగని, తెలిసిన తరువాత కూడా తీసుకోని రాజ్యసింహాసనం ఇంకా ఖాళీగానే ఉంది అన్నా, నేనే వచ్చి అడుగుతున్నాను కాబట్టి నీవు అడవినుంచి అయోధ్యకు వచ్చి సింహాసనం అధిష్టించ వల్సిందిగా సకల పరివారంతో వెళ్లి అడిగాడు భరతుడు. రామ - భరతుల మధ్య ఈ విషయంలో వాదోపవాదాలు చాలా దీర్ఘంగా సాగుతాయి. మనం భరతుడి వైపు వింటున్నప్పుడు ఇక రాముడు మనసు మార్చుకోవాల్సిందే అనిపిస్తుంది. కానీ పితృవాక్య పరిపాలన అంటే ఆయన లేనప్పుడు పట్టించు కోవాల్సిన పనిలేని మాట కాదని ధర్మం, ధర్మసూక్ష్మాన్ని రాముడు తమ్ముడికి విడమరిచి చెబుతాడు. అయినా భరతుడు ఒక పట్టాన వినడు. చివరికి వశిష్ఠుడి ప్రమేయంతో రామ పాదుకలను భరతుడు నెత్తిన పెట్టుకుని వచ్చేస్తాడు. నీవు వచ్చేవరకు మాత్రమే అది కూడా నీ పాదుకలే పాలిస్తున్నాయని భావిస్తూ నేను సంరక్షకుడిగా ఉంటానని రాముడికి చాలా స్పష్టంగా చెప్పాడు భరతుడు. రామ భరతులు, రామ-విశ్వామిత్రులు, రామ-హనుమలు, దశరథ-జనకుల మధ్య వాల్మీకి ఎంత ఉదాత్తమైన నడక నడిపాడో, రావణ- కుంభకర్ణాదు లు, రావణ- హనుమ, రావణ-సీత, రావణ- మారీచుల మధ్య కూడా అంతే గంభీరంగా నడక నడుస్తుంది. రావణుడిని మొట్టమొదట హనుమ చూసినప్పుడు అహోరూపం, అహోధైర్యం అంటూ ఏమి రూపం, ఎంత తేజస్సు? అని ఆశ్చర్యపోయేలా చేసిన వాల్మీకి వెంటనే తెల్ల నీళ్ల మధ్య పెద్ద ఏనుగులా, మినుముల రాశిలా రావణుడు పడుకుని ఉన్నాడంటాడు. ఫలానావాడు మంచివాడు, ఫలానావాడు దుర్మార్గుడు అని వాల్మీకి తీర్పుల జోలికి వెళ్లలేదు. రామచరితను మనముందు పెట్టాడు. రామాయణ సారంగా, రాముడి గుణగణాలకు సర్టిఫికేట్ లాంటి మాటలను దుష్ట రాక్ష పుడైన మారీచుడిచేత చెప్పించాడు- అది కూడా రావణాసురుడికి. ఆధునిక జీవితంలో వేగం పెరుగుతోంది. వసతుల మీద ఉన్న శ్రద్ధ విలువల మీద ఉండడంలేదు. భార్యాభర్తల మధ్య పరస్పర అనురాగం, అవగాహన సన్నగిల్లుతున్నాయి. పగలు, రాత్రి ఉద్యోగాలతో కుటుంబంలో ఎవరు ఎప్పుడు ఇంట్లో ఉంటారో వారికే తెలియడంలేదు. అనుమానాల పునాదుల మీద సంసారాలు కదిలిపోతున్నాయి. అభిరుచులు, ఆర్జనలు, పట్టింపులే తప్ప దంపతులుగా కలకాలం కలిసి నడవాల్సిన దారులు మధ్యలోనే వేరవుతున్నాయి. సీతారాములు పడ్డ కష్టాలెన్ని? ఎదుర్కొన్న అవమానాలెన్ని? ఎలాంటి వైభవోపేత జీవితం నుండి ఎలాంటి వనవాసంలోకి వెళ్లారు? దంపతులు కష్టనష్టాల్లో తోడు నీడగా నడవాలన్న సందేశం రామాయణం కంటే మరొకటి ఇవ్వగలదా? వావి వరసలు మరచి ప్రవర్తిస్తున్నవారు తారసపడుతూనే ఉన్నారు. వారానికో పెళ్లి, నెలకో విడాకులు, సంవత్సరానికి సంతానంతో - అన్నా చెల్లెళ్ల ప్రేమలు, పెళ్లిళ్ల దాకా వెళ్తే ఎవరు, ఎవరికి ఏమవుతారో తెలియక చివరికి మాడి మసి అవుతున్న బంధుత్వాలు మన కళ్లముందే కనబడుతున్నాయి. అన్నదమ్ములు, వదిన-మరుదులు ఎలా ఉండాలో రామాయణం కంటే మరొకటి చెప్పగలదా? అయోధ్య రాముడు ఆటవికుడైన గుహుడిని ఆత్మ సమాన మిత్రుడిగా సంబోధించాడు. వానరజాతి సుగ్రీవుడి ఆచారాలను గౌరవించాడు. రాక్షసజాతి విభీషణుడి విలువలకు పట్టం కట్టాడు. ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారి అభిప్రాయాలను వినడం, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం ఒక సంస్కారం. మనకు నచ్చినా, నచ్చకపోయినా అవతలివారి జీవన విధానాన్ని, ఆలోచనా సరళిని గౌరవించి తీరాలన్న ప్రాథమిక నియమాన్ని రామాయణం కంటే మరొకటి చెప్పగలదా? లోకంలో ధర్మాధర్మాలకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పదితలలు లేకపోయినా వేయి చెడు ఆలోచనల తలలతో రావణాసురులు మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. రక్తమాంసాలతోపాటు తమ సర్వస్వాన్ని ధారపోసి పెంచి పోషించిన తల్లిదండ్రులను పూచికపుల్లకంటే హీనంగా చూస్తున్న వారున్నారు. అధికారం కోసం తండ్రిని బందీ చేసేవారున్నారు. తోబుట్టువులను చంపేవారున్నారు. మంచి చెప్తే మొహాన ఉమ్మేసేవారున్నారు. ఏది తప్పో - ఏది ఒప్పో తెలియక తాము చేస్తున్నదే మంచి అన్న భ్రమలో పాపకూపంలో కూరుకుపోతున్నవారున్నారు. ఇలాంటి వారికి చేరాలనే వాల్మీకి రామాయణాన్ని గ్రంథస్థం చేశాడు. శీలం, గుణం ప్రాణంగా బతికితే మనలో రాముడుంటాడు. విలువల వలువలు విప్పి తిరిగితే మనలో రావణుడుంటాడు. ధర్మం మీద మన జీవితం నిలబడితే రామబాణం దొరుకుతుంది. అధర్మం మీద బతికితే రావణ వధ జరుగుతుంది. యుగాలు మారినా వాల్మీకి రామాయణం నిచిలి ఉంటుంది. - పమిడికాల్వ మధుసూదన్, సీనియర్ పాత్రికేయులు (నేడు వాల్మీకి జయంతి )