‘క్రమబద్ధీకరణ’ కష్టమేనా?
సాక్షి, హైదరాబాద్ : మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ఎల్ఆర్ఎస్/బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులు అటకెక్కాయి. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ల క్రమబద్ధీకరణకు మరోసారి అవకాశమిచ్చే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంతో అయోమయం నెలకొంది. ఈ విషయమై రెండు నెలల క్రితం కొత్త ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన కరువైంది.
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ఐటీ బకాయిల కింద రూ.485 కోట్లు తక్షణం చెల్లించాల్సి రావడంతో హెచ్ఎండీఏ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇందుకు సర్కార్ నిధులు సమకూర్చక పోయినా... కనీసం ఎల్ఆర్ఎస్/బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులనైనా క్లియర్ చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు.
విషయాన్ని సచివాలయం స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫైల్ సీఎం వద్ద ఉందని చెబుతుండటంతో చేసేదిలేక వెనుదిరుగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను పర్యవేక్షిస్తున్నందున హెచ్ఎండీఏ చైర్మన్ హోదాలో చర్యలు చేపట్టి సంస్థను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని అధికారులు అభ్యర్థిస్తున్నారు.
రూ.200 కోట్ల ఆదాయం
నగర శివార్లలో 80 వేలకు పైగా అక్రమ లే అవుట్లు, నిర్మాణాలున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వీటిని క్రమబద్ధీకరిస్తే మరో రూ.200 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. ఇప్పటికే మొత్తం ఫీజు చెల్లించిన వారు 1000 మంది, సగం ఫీజు చెల్లించిన వారు 15 వేలకు పైగా ఉన్నారు. అయితే క్రమబద్ధీక రించినట్లుగా వారికి అధికారిక పత్రం ఇవ్వలేదు. ఎల్ఆర్ఎస్/బీపీఎస్లపై ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేదాకా తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసినా రూ.100 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
వారిపై చర్యలేవీ?
ఎల్ఆర్ఎస్, బీపీఎస్ల కింద దరఖాస్తు చేసుకున్న వారికి మినహా అసలు ఈ పథకాన్ని ఇంతవరకు పట్టించుకోని వారి సంగతే హెచ్ఎండీఏకు పట్టినట్లులేదు. వారికి నోటీసులు జారీ చేసేందుకు హెచ్ఎండీఏ వద్ద తగిన జాబితా అంటూ లేదు. శివార్లలో అనేక విద్యాసంస్థలు, పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. పలుచోట్ల అడ్డగోలుగా లే అవుట్లు వెలిశాయి. వీటిలో కనీసం 5 శాతం కూడా దరఖాస్తు చేసుకున్న పాపానపోలేదు. నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ కింద 4500 దరఖాస్తులు రాగా వీరిలో 10 శాతం కూడా ఫీజు చెల్లించలేదు.
శామీర్పేట, తూముకుంట, కొంపల్లి, కొహెడ, నాగారం, దమ్మాయిగూడెం ప్రాంతాల్లో క్రమబద్ధీకరించాల్సిన లేఅవుట్లు అధికంగా ఉన్నాయి. మణికొండ, బండ్లగూడ, పీరాన్చె రువు, అమీన్పూర్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాల్లో 30-40 శాతం మేర మాత్రమే ఫీజు వసూలయ్యాయి. అందరూ క్రమబద్ధీకరణకు ముందుకు వస్తే హెచ్ఎండీఏకు రూ.250-300కోట్లు ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది.