Legal barriers
-
‘కొండపోచమ్మ’కు పచ్చజెండా!
సాక్షి, హైదరాబాద్ : కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈనెల 4న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నీటిని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్కుమార్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది. నీటిని విడుదల చేయరాదన్న గత ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల, బాహిలాంపూర్ గ్రామాలకు చెందిన ముంపు బాధితులు దాఖలు చేసిన వ్యాజ్యాలను శుక్రవారం ధర్మాసనం మరోసారి విచారించింది. ఒకసారి అవార్డు జారీ అయ్యాక తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నీటిని విడుదల చేయడం వల్ల బహుళ ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉంటాయని, అయితే బాధితులకు పరిహారం, పునరావాసం వంటివి చట్ట ప్రకారం అమలు అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చింది. బాధితులకు చెరువు ఎల్టీఎఫ్ పరిధిలో కాకుండా గజ్వేల్లో రెండు పడక గదుల ఇళ్లలోకి వెళ్లేందుకు ఆసక్తి ఉంటే అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వగలమని స్పష్టం చేసింది. కోతకు వచ్చిన పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నిల్వ ఉన్న పంటల్ని ప్రభుత్వమే భద్రపరచాలని ఆదేశించింది. బాధితులకు చెందిన పశువులను పశు వైద్యుల సమక్షంలో తరలించాలని అధికారులను ఆదేశించింది. చదవండి: 17దాకా లాక్డౌన్.. సడలింపులివే..! రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయ్యిందని, 97 శాతానికి పరిహారం కూడా చెల్లించామని ఏజీ చెప్పారు. ఇతరులకు కూడా పునరావాస చర్యలు తీసుకుంటామన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ, అవార్డును సవాల్ చేశామని, దీనిపై హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే వరకూ నీటి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. అయితే ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని, కొద్ది మంది కోసం నీటిని విడుదల చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయినా అవార్డు జారీ అయ్యాక తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ, విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది. నక్సలిజంవైపు అడుగులేస్తే ఎవరు బాధ్యులు తొలుత విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మే 1 వరకూ హైకోర్టు గడువు ఇచ్చినప్పటికీ అధికారులు ఏప్రిల్ 30 రాత్రి 600 వందల మంది పోలీసులతో, పాతిక వాహనాల్లో వచ్చి బాధితులను బలవంతంగా ఖాళీ చేయించారని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఫోన్లు కూడా పనిచేయకుండా చేశారని తెలిపారు. బలవంతంగా ఇళ్ల నుంచి బాధితులను ఖాళీ చేయించడంపై కలెక్టర్, ఆర్డీవోలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామని మరిచిపోరాదని, ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నది ఇందుకేనా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పదిపన్నెండేళ్ల పిల్లల ఎదుట వారి తల్లిదండ్రులను లాక్కునిపోతుంటే, వారి ఇళ్లను కూల్చేస్తే ఆ పిల్లల్లో పాలకులపై వ్యతిరేక భావన ఏర్పడుతుందని, నక్సలిజం వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా ఉంటుందని, రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తారని, అదే జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను బ్రిటీష్ రాణి నియమించినట్టుగా భావించవద్దని ఘాటు వ్యాఖ్య చేసింది. ఈ మొత్తం ఘటనపై బాధితుల గోడును సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాన్ని నమోదు చేసి పూర్తి నివేదికను తమకు అందజేయాలని సిద్దిపేట 4వ అదనపు జిల్లా జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. -
క్రమబద్ధీకరించని కట్టడాలను కూల్చేస్తాం
- చట్టపర అడ్డంకులు, ఇతర అభ్యంతరాలు లేకుంటేనే క్రమబద్ధీకరణ: తలసాని - దేవాదాయ, వక్ఫ్, నాలా, చెరువు, మున్సిపల్ స్థలాల్లో నిర్మాణాలను ఉపేక్షించం సాక్షి, హైదరాబాద్: చట్టపరమైన అడ్డంకులు, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధీకరించేందుకు ఆస్కారం లేని అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో దేవాదాయ, వక్ఫ్ భూములు, నాలాలు, చెరువులు, మున్సిపల్ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు వీలు కాదని, వాటిని కూల్చివేయక తప్పదని చెప్పారు. కూల్చివేతల వల్ల ఇళ్లను కోల్పోయే పేదలకు ప్రభుత్వం అమలు చేయనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద పునరావాసం కల్పిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు, ప్రభుత్వ సలహాదారుడు పాపారావుతో మంత్రి తలసాని నేతృత్వంలోని కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ, కొత్త భవన నిర్మాణ పాలసీ రూపకల్పన తదితర అంశాలపై చర్చించింది. అనంతరం మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ నగరంలోని అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం త్వరలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణతో పాటు భవిష్యత్లో మళ్లీ కొత్త అక్రమ కట్టడాలు పుట్టుకురాకుండా నియంత్రించాలన్న ఉద్దేశంతో చివరిసారిగా ఈ పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. భవిష్యత్లో క్రమబద్ధీకరణలకు అవకాశం ఉండబోదని, ఒకవేళ ఎక్కడైనా అక్రమ కట్టడం/లే అవుట్ వెలిసినా.. ఆ ప్రాంత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కొత్త భవన నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. తాకట్టు(మార్ట్గేజ్) నిబంధన వల్ల ప్రస్తుతం పేదలు 100 గజాలు, 150 గజాల్లో సైతం ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి పొందలేకపోతున్నారని, పేదలకు ఈ విషయంలో సడలింపు ఇస్తామన్నారు. నగరంలోని కోటి 42 లక్షల మంది జనాభా అవసరాలకు తగ్గట్లు సదుపాయాలను కల్పించేందుకు బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకనే అక్రమ కట్టడాలు, లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయని, దీనికి పరిష్కారంగా అన్ని శాఖల అనుమతులు ఒకే దగ్గర లభించేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి తలసాని చెప్పారు.