breaking news
leases
-
పెన్నోబులేసునికి.. రాజకీయ గ్రహణం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కార్యనిర్వహణాధికారి (ఈఓ) దీర్ఘకాలిక సెలవుల కారణంగా ఆలయ నిర్వహణ – మాన్యం భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మాన్యం భూములు దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు లీజు ఎగ్గొట్టడమే కాకుండా అనధికారికంగా భూములు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉరవకొండ/అనంతపురం కల్చరల్: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అనంతపురం జిల్లా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సాగాల్సిన పాలనా వ్యవహారాలపై చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) గా ఎవ్వరు వచ్చినా కొద్దిరోజులకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల లీజుల కేటాయింపు–నిధుల ఖర్చు చేయాలంటూ వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే ఆలయంలో ఏమి జరిగినా దిక్కు లేకుండా పోతోంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2,114 ఎకరాల మాన్యం ఉంది. ఇందులో 146 ఎకరాల ఈనామ్ భూమి, 412 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. మిగతా 1,554 ఎకరాలు ఆమిద్యాల, మోపిడి, కోనాపురం, పెద్దముస్టూరు, మూలగిరిపల్లి, రాచెర్ల, చిన్నముసూ్టరు పరిధిలో ఉన్నాయి. ఆలయ మాన్యాలు కొంతమంది అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయి. సొంత భూములు ఉన్నా సరే నామమాత్రపు కౌలు చెల్లిస్తూ కొన్నేళ్లుగా ఆలయ భూమిని అనుభవిస్తున్నారు. సాధారణంగా వర్షాధారం అయితే ఎకరాకు రూ.6 వేలు, సాగునీటి సౌకర్యం ఉంటే ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలు చెల్లించాల్సి ఉన్నా.. ఇక్కడ నారసింహుడికే నామాలు పెట్టి ఎకరాకు నామమాత్రంగా రూ.500 నుంచి రూ.2,500 ఏడాదికి చెల్లిస్తున్నారు. కౌలుదారుల్లో చాలామంది అనధికారికంగా సబ్లీజుకు ఇచ్చుకున్నారు. కొందరు అధికార పార్టీ నేతలైతే కౌలు భూమి తమ సొంత ఆస్తి అయినట్టు ఇతరులకు విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి సుమారు 1,400 ఎకరాలకు సంబంధించి కౌలు లీజు ముగిసినా నేటికీ ఆలయ భూములకు బహిరంగ వేలం పాటను అధికారులు నిర్వహించలేదు. 20 శాతం మంది మాత్రమే అసలైన కౌలుదారులు సక్రమంగా ఆలయానికి సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయ భూముల టెండర్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అన్నీ తామై సిండికేట్గా మారి టెండర్లు దక్కించుకోవాలని చూడటంతో గతేడాది ఆగస్టు నుంచి వరుసగా మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఏడాదికి సగటున 20 వేల మంది స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. 2024–25 ఏడాదికి ఉరవకొండకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు రూ.27 లక్షలకు తలనీలాల సేకరణ హక్కులను దక్కించుకున్నాడు. అయితే ఇందులో రూ.9.5 లక్షలు మాత్రమే సదురు టీడీపీ నాయకుడు ఆలయానికి చెల్లించి, మిగతా సొమ్ము నేటికీ జమ చేయలేదు. ఈ సొమ్ములో కూడా గతంలో ఈఓగా విధులు నిర్వహించిన ఓ అధికారి తన సొంతానికి రూ.3 లక్షలు వాడుకున్నట్లు ఆలయ సిబ్బందే గుసగులాడుకోవడం గమనార్హం. భక్తులు పరమపవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం పెన్నహోబిలంలో కొంతకాలంగా కనుమరుగైంది. లడ్డూ ప్రసాదం టెండరు ప్రక్రియ ఆగిపోయి చాలా కాలమైంది. అధికార పార్టీ నేతలు – దేవదాయ శాఖ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో భక్తులకు లడ్డూ ప్రసాదమే లేకుండా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా రమేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. అయితే టీడీపీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో భరించలేకపోయిన ఆయన దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. దీంతో అప్పటి జిల్లా సహాయ కమిషనర్ (ఏసీ) తిరుమలరెడ్డికి ఆలయ ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనకూ అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పలేదు. దీంతో ఆయన కూడా సెలవులోకి వెళ్లిపోయారు. తదుపరి ఈఓ బాధ్యతలు గుంతకల్లుకు చెందిన మల్లికార్జున తీసుకుంటారని ఎండోమెంటు అధికారులు చెప్తున్నా.. ఆయన మాత్రం ముందుకు రాలేదు. ఈ క్రమంలో అనంతపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం ఈఓగా ఉన్న సుధారాణికి తాత్కాలికంగా పెన్నహోబిలం ఆలయ బాధ్యతలు అప్పగించారు. పెన్నహోబిలం ఆలయ నూతన పాలక మండలి ఇంకా కొలువుదీరలేదు. అయినా సభ్యులుగా తామే ఉంటామని, మేము చెప్పినట్లుగా మీరు పనిచేయాల్సి ఉంటుందని కొందరు అధికార పార్టీనేతలు ఈఓలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి అయ్యే రూ.5 లక్షల ఖర్చును ఆలయ నిధుల నుంచే వెచ్చించాలని షరుతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఈ అంశం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. చేసేది లేక సెలవుపై వెళ్తున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం పెన్నహోబిలంలో మేం గుర్తించిన సమస్యలను పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కొన్నాళ్లుగా ఈఓ లేనిమాట నిజమే. సెలవులో ఉన్న తిరుమలరెడ్డి ఈ నెల 19న వస్తారు. అప్పటి వరకు నేను ఇన్చార్జ్గా మాత్రమే కొనసాగుతాను. కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా మేము కూడా ఎండోమెంటు ఇన్స్పెక్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. – సుధారాణి, పెన్నహోబిలం ఆలయఇన్చార్జ్, దేవదాయ శాఖ ఇన్చార్జ్ ఏసీ -
ఖనిజాల వేలం కాసులు రాల్చేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34 చిన్న తరహా ఖనిజాల బ్లాకుల కోసం క్వారీ లీజులు మంజూరు చేసేందుకు గనులు, భూగర్భ వనరుల శాఖ రెండోవిడత వేలానికి సిద్ధమవుతోంది. ఈ బ్లాకులకు సంబంధించి గత నెల 17న నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 14 నుంచి 22వ తేదీల నడుమ వేలం వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 25 నాటికి ఖనిజ బ్లాకుల క్వారీల వేలం పూర్తవుతుందని గనులు, భూగర్భ శాఖ ప్రకటించింది. బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, రఫ్ స్టోన్, మెటల్, గ్రావెల్, లేటరైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, మొజాయిక్ చిప్ బ్లాకులు వేలం వేయనున్నారు. 2015 ఖనిజ వేలం నియమావళిని అనుసరించి తొలివిడతలో ఈ ఏడాది ఏప్రిల్లో గనులు, భూగర్భ శాఖ సుమారు 75 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 256 మినరల్ బ్లాక్లకు వేలం వేసింది. 19 బ్లాక్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.56 కోట్లు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం రెండో దశలో 34 మినరల్ బ్లాకుల వేలం జరగనుండటంతో ప్రభుత్వ ఖజానాకు సమకూరే ఆదాయంపై ఆసక్తి నెలకొంది. అయితే తొలి విడతతో పోలిస్తే రెండో విడతలో బ్లాకుల వేలానికి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదని గనుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యావరణ అనుమతులే కీలకం తొలివిడత ఖనిజ బ్లాకుల వేలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అటవీ, పర్యావరణ అనుమతులు సాధించి తెచ్చింది. రెండో విడతలో 34 చిన్న తరహా ఖనిజ బ్లాకులు వేలం ద్వారా పొందే లీజుదారులు అటవీ, పర్యావరణ అనుమతులు సొంతంగా సాధించుకోవాల్సి ఉంటుంది. అనుమతుల భారం లీజుదారులపైనే ఉండటంతో వేలంలో పాల్గొనేందుకు ఔత్సాహికులు వెనుకంజ వేస్తున్నట్టు గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. 5 హెక్టార్లకు పైబడిన విస్తీర్ణంలో ఉన్న బ్లాకులను వేలం ద్వారా పొందేవారు రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు పొందాలనే టెండరు నిబంధన విధించారు. అనుమతుల కోసం వెళ్లే లీజుదారులకు పర్యావరణ, అటవీ శాఖల నుంచి అనేక అభ్యంతరాలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. మరోవైపు ఖనిజాల మైనింగ్ను వ్యతిరేకిస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంటి సంస్థలను ఆశ్రయిస్తే వేలంలో బ్లాకులను దక్కించుకున్నా ముందుకు సాగే అవకాశముండదనే అభిప్రాయం ఔత్సాహికుల్లో నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని అటవీ, పర్యావరణ అనుమతులు ఇప్పిస్తేనే వేలంలో పాల్గొంటామని చెబుతున్నారు.సున్నపురాయి గనుల్లోనూ..! సూర్యాపేట జిల్లా పసుపుల బోడులో సున్నపురాయి గనుల తవ్వకానికి లీజు మంజూరు కోసం గత ఏడాది అక్టోబర్లో మూడు బ్లాక్లను గనుల శాఖ వేలం వేసింది. వేలంలో ఈ బ్లాకులను దక్కించుకున్న లీజుదారులు కూడా పర్యావరణ, అటవీ అనుమతులు సాధించడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. పసుపులబోడు గనుల లీజు పొందిన వారికి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చేందుకు ఐదు నుంచి ఏడేళ్ల కాలం పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు సాధించిన తర్వాత ఖనిజ బ్లాకుల వేలం ప్రక్రియను కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం!
భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ 'టీసీఎస్' (TCS) నోయిడాలో సుమారు 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇది ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో అతిపెద్ద ఆఫీస్ స్పేస్లలో ఒకటి కానున్నట్లు సమాచారం. లీజుకు తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం రిటర్న్ టు ఆఫీస్ అని తెలుస్తోంది. ఇప్పటికే TCS కంపెనీ తమ ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని ఫైనల్ వార్ణింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీ ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ స్థలం నోయిడా ఎక్స్ప్రెస్వేలోని అసోటెక్ బిజినెస్ క్రెస్టెరాలో ఉంది. ఆఫీస్ స్పేస్ అవసరాలకు ఐటీ కంపెనీలు ప్రధాన కారణమని, వర్క్ ఫ్రమ్ హోమ్ ముగింపు వల్ల రాబోయే రోజుల్లో ఆఫీసులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులందరూ ఆఫీసులకు రావడం మొదలుపెడితే.. ఆఫీస్ స్థలాలు ఎక్కువ అవసరమవుతాయి. దీంతో నోయిడా ప్రాంతంలో ఆఫీసులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ జెన్పాక్ట్, సెలెబల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు కూడా ఆఫీసు స్థలాలను లీజుకు తీసుకున్నాయి. ఇదీ చదవండి: మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల! రిటర్న్ టు ఆఫీస్ TCS కంపెనీలో ఇప్పటికే 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలిన ఉద్యోగులందరూ కూడా మార్చి ఆఖరినాటికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీ డెడ్లైన్ విధించినట్లు సమాచారం. కంపెనీలో పనిచేసి ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికి టీసీఎస్ సిద్ధమైంది. -
నెలకు రూ. 40.50 లక్షలు రెంట్ ఇవ్వడానికి రెడీ.. అట్లుంటది కుబేరుడంటే?
ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన 'బెర్నార్డ్ ఆర్నాల్డ్' (Bernard Arnault)కి చెందిన లూయిస్ విట్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని ఉబెర్ లగ్జరీ మాల్ అయిన జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్ కోసం మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లను లీజుకు తీసుకుంది. దీనికి నెలకు అద్దె రూ. 40.50 లక్షలు కావడం గమనార్హం. సంస్థ 60 నెలల లాక్-ఇన్ పీరియడ్తో 114 నెలలకు (9.5 సంవత్సరాలు) రూ. 2.43 కోట్ల లైసెన్స్ ఫీజు సెక్యూరిటీ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా ప్రతి 36 నెలల తరువాత రెంట్ 15 శాతం పెరుగుతుంది. ఈ డీల్ 2023 ఫిబ్రవరి నుంచి 2032 డిసెంబర్ వరకు ఉండనుంది. ఇదీ చదవండి: మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్ 1854లో పారిస్లో లూయిస్ విట్టన్ స్థాపించిన ఈ కంపెనీ 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో భారతదేశంలో తన మొదటి షాప్ ప్రారంభించింది. అయితే ఈ రోజు బెంగళూరులోని UB సిటీ, న్యూఢిల్లీలోని DLF ఎంపోరియో, దక్షిణ ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్తో సహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్లను కలిగి ఉంది. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతాళలేక పండగపూట ఓ రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున సూర్యాపేట నియోజకవర్గంలోని చిదేముల్లో జరిగింది. చిదేముల్కు చెందిన దారావత్ దేవ్(55)కు ఆరు ఎకరాల పొలం ఉంది. భూమి సాగు కోసం.. పిల్లల పెళ్లిళ్ల కోసం ఆరు లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పు తీర్చేందుకు ఈ ఏడాది తనకున్న పొలంతో పాటు.. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంట వేశాడు. సరైన వర్షాలు లేక పంట ఎండిపోయింది. అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరిగింది. దీంతో రెండెకరాల పొలం అమ్మి మూడు లక్షలు అప్పుతీర్చాడు. కానీ.. రుణాల వత్తిడి తగ్గలేదు.. దీంతో మనస్ధాపం చెందిన ధరావత్ బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కాపాడి. ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రగాయాల పాలైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. ధరావత్ కు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురికి పెళ్లి కాగా.. మరో పెళ్లీడుకొచ్చిన ఆమ్మాయి ఉంది.


