breaking news
Justice Sengupta kalyanjyoti
-
మీ వల్ల కాకుంటే సీఈసీకి అప్పగిస్తాం
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు ఎన్నికల నిర్వహణకు 249 రోజులెందుకు? ఆ గడువును ఎలా సమర్థించుకుంటారో చెప్పండి ఏజీకి ఆదేశం.. విచారణ సోమవారానికి వాయిదా హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణ కోసం ఏకంగా 249 రోజుల గడువు కోరడంపై హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణకు అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ‘మీకు (ప్రభుత్వం) అవసరం కాబట్టి సాధారణ ఎన్నికలను, ఉప ఎన్నికలను ఆగమేఘాలపై నిర్వహిస్తారు. కాని చట్టబద్ధంగా నిర్వహించాల్సిన జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించేందుకు గడువు కావాలంటారు. అసాధారణ అలసత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మీరు (ప్రభుత్వం) ఎన్నికలు పెట్టకుంటే ఆ పనిని మేం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కు అప్పజెబుతాం’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 249 రోజుల గడువు కోరడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జి చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం దానిని మరోసారి విచారించింది. ప్రభుత్వం తరఫున ఏజీ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 200కు పెంచామని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందన్నారు. ఈ జీవోను పరిశీలించిన ధర్మాసనం, జీవోను జారీ చేయడానికి 30 రోజుల గడువు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. అధికారుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని ఏజీ చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన షెడ్యూల్ను పరిశీలించిన ధర్మాసనం, పలు అంశాలపై వివరణ కోరింది. ‘అవసరమైతే ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పజెబుతాం. జీహెచ్ఎంసీకి ఎన్నికలు పెట్టి తీరాల్సిందే. మీరు ఈ విధంగా 249 రోజులు అంటూ అసాధారణ గడువు కోరడం సరికాదు. మిగులు నిధులున్న మీ రాష్ట్రంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టకుంటే ఎలా..?’ అని వ్యాఖ్యానించింది. దీనికి ఏజీ స్పందిస్తూ, మిగులు నిధులన్నది మీడియా ప్రచారమేనంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మీడియా గాల్లో నుంచి రాయదు కదా. అధికారులు చెబితేనే వారు రాసేది అంటూ వ్యాఖ్యానించింది. 249 రోజుల గడువును ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ఏజీకి స్పష్టం చేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
నిజాయితీని ఎవరూ గుర్తించడం లేదు
జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన ఆయనకు హైకోర్టు ఘన వీడ్కోలు సాక్షి, హైదరాబాద్: జనవరి 7న పదవీ విరమణ చేయనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్కు హైకోర్టు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది. గురువారం నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో ఆయనకు బుధవారమే హైకోర్టు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం లో జస్టిస్ చంద్రకుమార్ కుటుంబ సభ్యులు, ఇరు రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, పి.వేణుగోపాల్, రిజిస్టార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ఇరువురు ఏజీలు కొనియాడారు. తరువాత జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... ఇన్నేళ్ల తన న్యాయ ప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేశారు. సమాజంలో రోజు రోజుకు డబ్బుకు ప్రాధాన్యత పెరిగిపోతూ, విలువలు నశించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీని, కష్టపడే తత్వాన్ని సమాజంలో గుర్తించడం లేదన్నారు. రోజు రోజుకు నిజాయితీ అన్నది అరుదుగా వినిపించే పదంగా మారిపోతుందని చెప్పారు. మానవ హక్కుల పరిరక్షణలో న్యాయవాదులు కీలక పోత్ర పోషించాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు కేసులు చేస్తున్న తీరును చూసి జూనియర్ న్యాయవాదులు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చునని, ఆ దిశగా జూనియర్ న్యాయవాదులు దృష్టి సారించాలని హితవు పలికారు. పదవీ విరమణ తరువాత కూడా తాను ప్రజల్లో న్యాయ అవగాహన కోసం పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తరువాత జస్టిస్ చంద్రకుమార్ను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది.